కేసీఆర్ దగ్గరే తేల్చుకుంటాం.. ఉద్యోగుల సీరియస్ వార్నింగ్

by  |
telangana-employees
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారుల మధ్య ఆప్షన్ల చిచ్చుమొదలైంది. జోనల్ పై బుధవారం నుంచి ఆప్షన్లు తీసుకుంటామని ఉన్నతాధికారులు ప్రకటిస్తే.. ఒక్కరు కూడా ఇవ్వరాదని ఉద్యోగ సంఘ జేఏసీ స్పష్టం చేసింది. దీనిపై సీఎం దగ్గరే తేల్చుకుంటామని చెబుతోంది. ఇప్పుడు ఎవరూ ఆప్షన్లు ఇవ్వకూడదని, దీనిపై ఎవరూ గందరగోళానికి గురి కావొద్దని అన్ని జిల్లాలకు సమచారం అందించింది.

ఉద్యోగుల సర్దుబాటు, కేడర్​ స్ట్రెంత్ నిర్ధారణ వంటి కీలక అంశాలను తేల్చకుండానే జోనల్ ఆప్షన్లు ఇవ్వమనడం సరికాదని అంటోంది. దీనిపై హైలెవల్ కమిటీ ఏర్పాటుకు డిమాండ్ చేస్తోంది. 2016లో కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు నేపథ్యంలో ‘ఆర్డర్ టు సర్వ్’ ప్రకారం పని చేయాలని ఉద్యోగులను సర్దుబాటు చేశారు. కొత్తగా ఎలాంటి భర్తీలు చేయలేదు. ఉన్నవారినే సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి వచ్చింది.

2018 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆ ఏడాది నుంచి నియమితులైన ఉద్యోగులకే కొత్త జోనల్ వర్తిస్తుంది. అందుకు భిన్నంగా దీనిని అందరు ఉద్యోగులకు ఆపాదించడంతో సమస్యల మొదలవుతోంది. దీనివల్ల పాత, కొత్త ఉద్యోగుల మధ్య సీనియారిటీ సమస్య తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో పాత ఉద్యోగులకు కొత్త జోనల్ విధానం ఎలా వర్తింపజేస్తారని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఎస్ తో మూడుసార్లు భేటీ సందర్భంగా జేఏసీ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

ఆర్డర్​ టూ సర్వ్ ఉత్తర్వులను రద్దు చేయాలని, 33 కొత్త జిల్లాల ప్రకారం జనాభా ప్రాతిపదికన కేడర్​స్ట్రెంత్​ ఖరారు చేయాలని డిమాండ్ చేసింది. అప్పుడే ఉద్యోగులు ఎంతో లెక్కలు తేలుతాయని అన్నారు. ప్రస్తుతమున్నట్లు చేస్తే కొత్త జోనల్ విధానంలో 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు వస్తాయనేది తప్పు అని, కనీసం 15 శాతం కూడా రావంటున్నారు.

సీఎం దగ్గరే తేల్చుకుంటాం..

సీఎం కేసీఆర్​ ఒకటి చెప్తే అధికారులు మరొకటి చేస్తున్నారు. ఈ ఆప్షన్ల ప్రక్రియతో పూర్తిగా విభేదిస్తున్నాం. దీనిపై సీఎం సమక్షంలో హైలెవల్ కమిటీతోనే తేల్చుకుంటాం. పాత ఉద్యోగుల ఆర్డర్​ టూ సర్వ్​ను రద్దు చేయకుండా ఎలా ఆప్షన్లు తీసుకుంటారు. ఆప్షన్లు ఇవ్వొద్దని ఉద్యోగులకు సూచిస్తున్నాం.
– మామిళ్ల రాజేందర్​, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్​


Next Story

Most Viewed