బడికి వేళాయే.. వసతులేమో లేవాయే

by  |
బడికి వేళాయే.. వసతులేమో లేవాయే
X

దిశ, కాటారం: ఎట్టకేలకు విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రత్యక్ష బోధనలకు సిద్ధమయ్యారు. జులై1 నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నా పూర్తిస్థాయి ఫలితం లేదు. తల్లిదండ్రుల వెంట విద్యార్థులు పనులకు వెళ్తున్నారు. 40-50 శాతం విద్యార్థులు మాత్రమే పాఠాలు వింటున్నారు. ఆటపాటలాడుతూ ఆన్ లైన్ క్లాసులను చూడకపోవడం, అల్లరిపనులు చేస్తూ చదువులకు దూరమయ్యారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బుధవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.

నెలలు తరబడి తరగతి గదులు మూసి ఉండటంతో దుమ్ము, దూలితో నిండిపోయాయి. 24వ తేదీ నుండి తరగతి గదుల్లో శానిటేషన్ పనులు ప్రారంభించారు. ప్రతి పాఠశాలలో థర్మల్ స్క్రీనింగ్ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా కారణంగా ఎప్పుడు పిల్లలతో కళకళలాడే చదువులమ్మ లోగిళ్ళు 19 నెలలుగా బోసిపోయాయి. విద్యార్థుల సందడి కరవైన పాఠశాల ప్రాంగణాల్లో గడ్డి పిచ్చి మొక్కలు పెరిగి విషపురుగు లకు నిలయంగా మారాయి ప్రహరీలు లేని పాఠశాలలు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. మరుగుదొడ్లు నిర్వహణ లేక నీటి వసతి కొరవడి ఉపయోగించలేని స్థితికి చేరాయి. కొన్ని పాఠశాల భవనాలు శిథిలావస్థలో కనిపించాయి. స్కావెంజర్లు, స్వీపర్లు, అటెండర్లు లేని పాఠశాలలు మండలాల్లో చాలా ఉన్నాయి. పాఠశాలల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది నీటి వసతి కులాయి లపై దృష్టి సారించాల్సి ఉంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి…

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు 315, ప్రాథమికోన్నత పాఠశాలలు 44, ఉన్నత పాఠశాలలు 69, కేజీబీవీ 11, మోడల్ స్కూల్స్ 6, సోషల్ వెల్ఫేర్2, ట్రైబల్ వెల్ఫేర్ 3, మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాలుర 1, ఆశ్రమ పాఠశాలలు 13, యూఆర్ఎస్, మధర్ థెరిస్సాలకు 1, ప్రైవేట్ పాఠశాలలు 70, ఉన్నాయి. ఈ పాఠశాలలో 46, 348 విద్యార్థులు ఉండగా, 23,247 మంది పురుషులు, 23,101 మంది బాలికలు పాఠశాలలకు రానున్నారు. మొత్తం 540 పాఠశాలలు ఉండగా 2716 మంది టీచర్లు ఉన్నారు.

ఇవీ కావలసిన వసతులు ..

జిల్లాలోని 448 పాఠశాలల్లో త్రాగునీటి వసతులు లేనివి 20, పురుషులకు టాయిలెట్లు 226, బాలికలకు టాయిలెట్లు 190, అసలే టాయిలెట్లు లేనివి 61, క్రీడా మైదానం లేని పాఠశాలలు 87 ఉన్నాయి.

ఆరు మండలాలకు ఒక్కరే .. విద్యాధికారి

జిల్లాలో మండల విద్యాధికారుల పోస్టులు ఖాళీలు ఎక్కువగా ఉండడంతో పర్యవేక్షణ కొరవడింది. జిల్లాలోని 11 మండలాల్లో 5 గురు ఎంఈఓలు విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మారుమూల మండలాలైన కాటారం, మహాముత్తారం, మల్హర్, మహదేవపూర్, పలిమెల, భూపాలపల్లి మండలాలకు కలిపి ఒక్కరే ఎంఈఓ గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా విద్యాశాఖలో ప్రమోషన్లు లేకపోవడంతో ఎంఇఓ పోస్టులు భర్తీ కాక ఇన్చార్జి బాధ్యతల తోనే కాలం వెళ్లదీస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి

వాట్సాప్ సందేశాలు…

బుధవారం నుండి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులకు వాట్సప్ సందేశాలతో విజ్ఞప్తి చేస్తున్నట్లు చింతకాని ప్రధానోపాధ్యాయులు హాట్ కార్ దేవ్ నాయక్ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలే సౌకర్యంగా ఉంటాయని అన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో గల వసతులు విద్యాబోధన ఇతరత్రా అంశాలను బేరీజు వేస్తూ విపులంగా వాట్సాప్‌లో సందేశాలు పంపిస్తూ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోకి రావాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed