అరేంజ్డ్ మ్యారేజీలకు మొగ్గు చూపుతున్న యువత

by Disha edit |
అరేంజ్డ్ మ్యారేజీలకు మొగ్గు చూపుతున్న యువత
X

ద్దరి వ్యక్తుల మధ్య శారీరక మానసిక ఆత్మ సంబంధమైన అన్యోన్య బంధమే పెళ్లి. దీనికి సమాజంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. పెళ్ళంటే నూరేళ్ళ పంట. కుటుంబ వ్యవస్థకు, వంశాభివృద్ధికి పునాది. పెళ్లితో మనుషుల జీవితాల్లో కొత్త మలుపు మొదలవుతుంది. ప్రేమ పెళ్ళి, పెద్దలు చేసిన పెళ్లి, దేశంలో పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటూ జంటలు ఏకమవుతున్నారు. మతాలు, కులాలు వేరైనా పెళ్ళితో భాగస్వాములు జీవిత కాలం కలిసి ఉండాలి. గతంలో తల్లిదండ్రుల ఇష్టం ప్రకారం పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు అలా కాదు పెళ్ళికి ముందే యువతీ యువకులు ప్రేమ, స్నేహాలు, డేటింగులు, షికార్లు చేస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో ఒకరిపై ఒకరికి ఇష్టం పెరిగి ప్రేమగా మారి పెళ్లిళ్లకు దారితీస్తుంది. పెళ్లి అయ్యాక ఇద్దరి మధ్య అవగాహన లేక పెళ్లయిన కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్నారు. దీనికి కారణం వారికి సరైన గైడెన్స్ చెప్పేవారు లేకపోవడమే. ప్రస్తుత యువత తమ జీవిత భాగస్వామి ఎంపిక పట్ల వ్యక్తిగత స్వేచ్ఛకు ఉత్సాహం చూపిస్తున్నారు. వారు ఎక్కువగా తెలిసిన వారిని చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు.

సర్వే ప్రకారం

అయితే దేశంలో ఇటీవల జరిగిన వివాహాలపై జరిపిన అధ్యయనం ప్రకారం యువత ఎక్కువగా పెద్దలు కుదిర్చిన వివాహాలనే చేసుకుంటున్నారని తేలింది. 2018లో 1,60,000 కుటుంబాలపై జరిపిన సర్వేలో 93 శాతం పెద్దలు కుదిర్చిన వివాహామేనని చెప్పారు. కేవలం 3 శాతం మాత్రం ప్రేమ వివాహం చేసుకోవడానికి, మరో 2 శాతం మాత్రం పెద్దలు అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నామని తెలిపారు. అలాగే 80 ఏళ్ళు దాటిన వారిలో 94 శాతం మంది పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నామని, అలాగే వివాహం చేసుకొని 20 ఏళ్ళు దాటిన వారిలో 90 శాతం జంటలు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నవారేనని తేలింది. ఇదే సర్వే 2014 లో 70000 మందిపై జరిపితే ఈ సర్వేలో కులాంతర వివాహాలు చేసుకున్న వారు కేవలం 10 శాతం కంటే తక్కువని, మతాంతర వివాహాలు అయితే కేవలం 5 శాతమేనని తేలింది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వివాహాల తీరు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. జనవరి 2018 నాటికి ప్రేమ వివాహాలు చేసుకున్న వారు కేవలం 3 శాతమని, సర్వేలో తేలింది. మంచి చదువు ఉద్యోగం చేస్తున్న దళిత యువకుడిని పెళ్ళి చేసుకోవడానికి ముందుకు వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అలాగే తెగించి పెళ్ళి చేసుకుంటే కుటుంబ సభ్యుల బెదిరింపులు, సాంఘిక బహిష్కరణ, గృహ బహిష్కరణకు గురై పరువు కోసం ప్రాణాలను బలికొనే పరిస్థితి నెలకొన్నది. కులాంతర వివాహాలు చేసుకున్న జంటల పట్ల అమానుష సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యువతీ యువకులు మనసుకు నచ్చిన వారిని చేసుకోవాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది.

వారి దాంపత్యంపై ఆధారపడి

2013 సంవత్సరంలో ఢిల్లీలో ఏడు జిల్లా కోర్టుల్లో అత్యాచారానికి సంబంధించిన 460 కేసుల్లో 40 శాతం అమ్మాయి, అబ్బాయి ఇష్టపడిన కేసులే. తమ పిల్లలు కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటే వారిపై అత్యాచారం, అపహరణ కేసులు పెట్టారు. తమ బిడ్డ కులాంతర వివాహం చేసుకుందని చెప్పడం కంటే అత్యాచారానికి గురైందని చెప్పుకోవడానికి తల్లిదండ్రులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదని సర్వేల్లో వెల్లడైంది. కులం తక్కువ అబ్బాయిని ప్రేమించిందని పరువు కోసం చేసే హత్యలు ఎక్కువయ్యాయి. కులాల మధ్య కుమ్ములాటలు, కుల విద్వేషాలు చోటుచేసుకొని సామాజిక సామరస్యత, కులాల మధ్య సంఘీభావం దెబ్బతిని ఇది సామాజిక శాంతికి విఘాతంగా పరిణమించిందని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భార్య భర్తల ప్రేమ, నమ్మకం, ప్రేమ పెళ్లి, పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇలా ఎలా పెళ్ళి చేసుకున్నా ఆ దాంపత్యం కేవలం భార్యాభర్తల పైనే ఆధారపడి ఉంటుంది. దాంపత్య జీవితంలో వారి మధ్య వున్న ప్రేమ, నమ్మకం, పరస్పరం కురిపించుకునే ప్రేమానురాగాలు కీలకం. జీవితం పంచుకోవడానికి తగిన వ్యక్తిని ఎంపిక చేసుకుంటే అది ప్రేమ వివాహమైన, పెద్దలు కుదిర్చిన వివాహమైన జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది. అవగాహన, సహకారం, మంచితనం, ఆత్మీయత బంధువులతో మెరుగైన సంబంధాలు, కుటుంబ పెద్దల పట్ల గౌరవం, ఆత్మీయత, అనురాగం, ప్రేమ, మానవీయత వంటి మెరుగైన జీవన విలువలు పాటించాలి. సమాజం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పునర్జీవం తో వివాహ వ్యవస్థ పవిత్రతకు పునరంకితం కావాలి. మమతానురాగాల ఆలంబనగా ఆదర్శనీయమైన జీవనశైలితో యువత వివాహ వ్యవస్థ పవిత్రత, పరిరక్షణ గా ఉండి వివాహాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలి.

నేదునూరి కనకయ్య

9440245771

Also Read....

దివాలా స్థితిలో దాయాది దేశం




Next Story

Most Viewed