ఈ మార్పు లేనిదే...ఆర్థికాభివృద్ధి అసాధ్యం

by Disha edit |
ఈ మార్పు లేనిదే...ఆర్థికాభివృద్ధి అసాధ్యం
X

భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. డా.బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మనకు అవగతమౌతుంది. డా.బి.ఆర్.అంబేద్కర్ రాజకీయాల్లో వ్యక్తిత్వం, ఆదర్శం, నీతి, నిజాయితీ చాలా అవసరమని చెప్పి స్వయంగా ఆచరించాడు. రాజకీయ నాయకులకు వ్యక్తిత్వం శూన్యమైతే భారత సామాజిక, సాంస్కృతిక వ్యవస్థ సంక్షోభంలో పడక తప్పదు. భారతదేశ వ్యాప్తంగా రాజకీయాల్లో అవినీతి పెరిగింది. అందువల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సింహభాగం సంపద రాజకీయ నాయకులు, కార్పోరేట్లు, పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లింది. కాబట్టే దేశంలో ప్రతి పదిమంది పిల్లల్లో ఒకరు దుర్భరమైన చాకిరీలో ఉన్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ పిల్లలు తొంబైశాతం అని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికీ బొగ్గు క్వారీల్లోనూ, హోటళ్లలో, రైల్వే ట్రాక్‌ల మీద కాగితాలు ఏరుకుంటూ విసిరేసిన డబ్బాలు ఏరుకుంటూ కాలే కడుపుతో కళ్ళు పీక్కుపోయి బతుకుతున్నారు. రాజ్యాంగం వీరికి కల్పించిన హక్కులను కాలరాచేస్తున్నారు. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న విషయం నిరుద్యోగం. సంస్కరణలు వృద్ధి రేటును పెంచినట్టు చూపిస్తున్నాయి కానీ నిరుద్యోగం విస్తృతంగా పెరుగుతోంది. రెగ్యులర్ ఎంప్లాయిస్‌ను తగ్గిస్తూ క్యాజువల్ లేబర్‌ను పెంచుతున్నారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం లేకుండా పోయింది. శ్రామిక సంక్షోభానికి తూట్లు పొడిచారు. ఆర్థిక సంస్కరణలు కుంటుపడడానికి కారణమైన లాకౌట్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగినవే. సంస్కరణల పేరుతో వ్యవస్థాపకుల భద్రత కోసం శాశ్వత శ్రామికుల్ని తొలగించి తాత్కాలిక ఉద్యోగుల్ని నియమిస్తూ వస్తున్నారు.

భూమి పంపకం ఎత్తేశారా?

శాశ్వత శ్రామిక వర్గాన్ని అంతరింపజేయాలనే ఉద్దేశంతోటే సమ్మె చేసే హక్కు, పోరాడే హక్కు వంటి రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీయాలనే పెద్ద ప్రయత్నం జరుగుతుంది. వ్యవసాయ రంగ విస్తరణ తొమ్మిదో ప్రణాళిక నుండి పద్నాలుగో ప్రణాళిక వరకు పరిశీలిస్తే రెండు శాతం దగ్గర స్తబ్ధంగా ఉండిపోయింది. కారణం వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల శాతం తగ్గిపోవడమే. దేశ వ్యాప్తంగా వ్యవసాయరంగానికి సరైన ప్రోత్సాహం లేదు. వరి, గోధుమ వంటి పంటలను ప్రోత్సహించి భూసారాన్ని సహజంగా పెంచే ప్రక్రియకు తిలోదకాలిచ్చారు. దాంతో వ్యవసాయ కూలీలుగా ఉన్న ముప్పై కోట్ల మంది ఎస్సీ, ఎస్టీలకు ఒక్క శాతం భూమి కూడా వారికి ఇవ్వలేదు. డా.బి.ఆర్. అంబేద్కర్ భూమిని పంచకుండా ఆర్థిక సామాజిక వ్యవస్థ బలపడదు అని స్పష్టంగా చెప్పాడు. ప్రధానంగా ఎస్సీ,ఎస్టీలకు భూమి పంపకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ నిలిపివేశాయి. దానివల్ల దళితుల్లో వ్యక్తిత్వ నిర్మాణం జరగడం లేదు. ‘‘భారతదేశంలో నేనొక వ్యక్తినీ, నాదొక కుటుంబం’’ అనే భరోసా రావాలంటే అది భూమి పంపకంతో సాధ్యమవుతుందని అంబేద్కర్ చెప్పాడు. రైతులు అంటే పంచ కులాలుగానే చెప్పుకోవడంలోనే, అన్ని రాష్ట్రాల్లో భూమి కలిగిన ఐదు అగ్ర కులాలుగా చెప్పుకోవడంలోనే నిర్లక్ష్యం దాగి వుంది. అంబేద్కర్ దేశంలోని ఏడు లక్షల గ్రామాల్లో నివసిస్తున్న దళితులందరికీ విద్యుత్ సౌకర్యం ఉచితంగా అందించినప్పుడే వారిలో వెలుగు వస్తుందని చెప్పాడు. ఇప్పటివరకూ నలభై శాతం దళిత వాడల్లో విద్యుత్తు లేదు. ఎస్సీ, ఎస్టీలు చీకటి గుహల్లో జీవిస్తున్నారు. అటువంటి సమయంలో వారి పిల్లలకు విద్యావకాశాలు ఎలా మెరుగు పడతాయని ఈనాటి సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దళితులను వ్యవసాయ కూలీల నుండి వ్యవసాయ దారులుగా మార్చకపోయినట్లైతే భారతదేశ ఉత్పత్తులు పెరగవు అని అంబేద్కర్ ఆనాడే చెప్పాడు. దేశంలో ఉత్పత్తులు స్తబ్ధతలో ఉండడానికి కారణం దళితులకు భూమీ, నీరూ, విద్యుత్తు, విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనల పట్ల మన పాలకులకు ఉన్న నిర్లక్ష్యమే అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే 2017, 2018 నాటి యునెస్కో లెక్కల ప్రకారం దేశంలో ముప్పై ఐదు శాతం మంది చదవడం, రాయడం రాని వారు ఉన్నారు అని లెక్క తేలింది. ఇందులో అధికంగా నిరక్షరాస్యులుగా ఉంటున్నది ఎస్సీ, ఎస్టీలే.

కులమే మనుగడకు పునాదా?

నిరక్షరాస్యులుగా ఉంచి మత భావాలు, కులభావాలు కలిగించడం ద్వారా ఓట్లు కొల్లగొట్టాలనే రాజకీయ వ్యూహం నుండి దళితులను, దళిత వయోజనులను బయటకు తీసుకు వచ్చినప్పుడే దళితుల్లో విద్యాభివృద్ధి చెందుతుందనేది స్పష్టం. ప్రకృతి శక్తులైన దళిత శ్రామిక శక్తుల మీద చూపిస్తున్న భారతదేశ నిర్లక్ష్యం రాజ్యాంగేతర భావజలంతో పెరుగుతుంది. అందుకే డా.బి.ఆర్.అంబేద్కర్ మన ఆర్థిక శాస్త్రంపై బ్రాహ్మణ భావజాలం ఉందని చెప్పారు. అంబేద్కర్ కుల, మతాలను అర్థం చేసుకున్నాక ఆయన ఆర్థిక, రాజకీయ, శాస్త్రాల మొత్తాన్ని ఈ పునాది నుండే చూసారు. మార్క్సిస్టులు ఈ అవగాహన నుండి ఇంతవరకు ఆర్థిక శాస్త్రాన్ని చూడలేకపోయారు. భారతదేశంలో ప్రారంభమైన ఏ విప్లవమైనా అది కులం ఊబిలోనే సతమతమౌతుంది. కులానికి పునాది అయిన మతాన్ని విస్మరించి మన ఉపరితలంలో ఎంత మాట్లాడుకున్నా మూలం ఘనీభవిస్తూనే ఉంటుంది. మళ్లీ దేశాన్ని పునర్నిర్మించాలంటే అంబేద్కర్‌ను అధ్యయనం చేయాల్సిన అవసరం ఇక్కడే తప్పనిసరి అవుతుంది. అంబేద్కర్ ఇలా అన్నాడు. ‘‘అధికారంలో ఉన్న వ్యక్తులు దేశ ప్రయోజనాల పట్ల నిర్ధ్వందమైన నిబద్ధత కలిగి ఉండేటటువంటి ప్రభుత్వం మనకు రావాలి. న్యాయాన్ని ఇచ్చే సామాజిక, ఆర్థిక నియమావళిని సవరించేటటువంటి ప్రభుత్వం మనకు రావాలి. విప్లవం రక్తపాతం లేనిదైనా, ఉన్నదైనా దాని కారణంగా వచ్చే మార్పు అస్థిరం. ఇకపోతే ఇప్పటికీ ఉద్యోగ వ్యవస్థలో బ్రాహ్మణ బనియాలదే పెద్ద పాత్ర అని ఇ పి డబ్ల్యు భారతదేశ అధికాఆర వర్గ వ్యవస్థ గురించి ఇలా పేర్కొంది. దేశ కార్పోరేట్ బోర్డ్ డైరెక్టర్లలో కులాల వారీగా చూస్తే బ్రాహ్మణులు 44.6 శాతం, వైశ్యులు 46.0 శాతం, ఎస్సీ, ఎస్టీలు 1 శాతం, బి.సి.లు 3.8 శాతం, తదితరులు 1.5 శాతం ఉన్నట్లు పేర్కొన్నారు.

సకల అనర్థాలకు మూలం కులం

1989-90లో ప్రభుత్వ సంస్థలు 1160 ఉంటే 2010 నాటికి 21,642కు పెరిగాయి. అదే ప్రైవేటు రంగ కంపెనీలు 1990లో రెండు లక్షలు ఉంటే ఇప్పుడు 805 లక్షలకు పెరిగాయి. వాటిలో పెట్టుబడి 64 వేల కోట్ల నుండి 11 లక్షల కోట్లకు పెరిగాయి. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బి.సి. మైనారిటీకి ఉద్యోగాలు ఉండవు. భయంకరమైన కుల వివక్ష ఉంది. తాజా అంచనాల ప్రకారం భారత కుబేరుల మొత్తం సంపద జీడీపీలో 15 శాతానికి సమానం. ఐదేళ్ల కిందట ఇది 10 శాతంగానే ఉంది. 2017 నాటికి భారత్‌లో 101 మంది బిలియనీర్‌లు ఉన్నారు. ఆదాయం, వినియోగం, సంపద విషయాల్లో ప్రపంచంలోనే అత్యంత అసమానతలు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలతో కునారిల్లుతున్న భారతీయ సమాజానికి ఆర్థిక అసమానతలు మరింత ఆందోళన కలిగించేవే. ఈ ఆర్థిక అసమానతల వల్ల దళిత, బహుజన మైనారిటీల, స్త్రీల పరిస్థితి అధోగతి పాలయ్యింది. డా.బి.ఆర్. అంబేద్కర్ ఆర్థిక శాస్త్ర సంపన్నుడు. ఆయన భారత దేశంలో కులం, అస్పృశ్యత, స్త్రీ వివక్ష పోయినప్పుడు మాత్రమే ఆర్థిక సంపద పెరుగుతుందని చెప్పాడు. ఈ విషయాన్ని ముఖ్యంగా కమ్యూనిస్టులు అర్థం చేసుకోలేకపోయారు. శూద్ర రాజకీయ వేత్తలు భూమి పంచడానికి సిద్ధంగా లేరు. అందువల్ల హిందుత్వ రాజకీయ వేత్తలు కులాన్ని, అస్పృశ్యతను స్థిరీకరించే క్రమంలో కార్పోరేట్ వ్యవస్థను విస్తృతం చేసి రాజ్యాంగ సూత్రాలు దళితులకు అన్వయం కాకుండా చేసి అస్పృశ్యతా భారతాన్ని కొనసాగించాలనే దుర్వ్యూహంలో ఉన్నారు. ఈ సందర్భంగా డా.బి.ఆర్.అంబేద్కర్ ప్రవచించిన కుల, నిర్మూలన, అస్పృశ్యతా నిర్మూలన భావజాలంతో భారత దేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఆర్థిక స్వావలంబన భాగం కల్పిద్దాం, దేశ ఆర్థిక ఉత్పత్తుల్ని పెంచి కుల రహిత గ్రామీణాభివృద్ధి పునాదిగా కుల వివక్ష లేని, స్త్రీ అణచివేత లేని సామాజిక వాదం సమ్మిశ్రతంగా నూతన ఆర్థి, సాంఘిక, సాంస్కృతిక విప్లవాన్ని, అంబేద్కర్ మార్గాన్ని నిర్మిద్దాం.

డా. కత్తి పద్మారావు

దళిత ఉద్యమ నాయకుడు.

98497 41695

Next Story