చరిత్రలో ఒక చీకటి రోజు...

by Disha edit |
చరిత్రలో ఒక చీకటి రోజు...
X

రక్తంతో తడిసిన నేల, బాధతో నిండిన ఆకాశం, జలియన్ వాలాబాగ్ ఘటన ఒక మారణ హోమం. నిరాయుధులైన ప్రజలపై బ్రిటిష్ దురాగతం, వేల మంది ప్రాణాలు ఒక్కసారిగా గాలిలో కలిసిపోయాయి. బాధితుల రోదనలు, ఆకాశాన్ని తాకాయి, స్వాతంత్రం కోసం పోరాటం, మరింత ఉధృతంగా మారింది. జలియన్ వాలాబాగ్ ఘటన, ఒక చారిత్రక మలుపు, భారతీయులలో స్వాతంత్ర్య స్ఫూర్తిని మరింత బలపరిచింది. భారత స్వాతంత్ర పోరాటంలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉందని గ్రహించాలి.

1919 ఏప్రిల్ 13 భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక విషాద ఘట్టం. జలియన్ వాలాబాగ్ ఊచకోతగా పిలువబడే ఈ సంఘటనలో, బ్రిటిష్ దళాలు నిరాయుధులైన భారతీయుల సమావేశంపై కాల్పులు జరిపి, వందలాది మందిని చంపాయి. ఈ దారుణం భారతీయుల హృదయాల్లో బ్రిటిష్ పాలన పట్ల తీవ్రమైన ద్వేషాన్ని పెంచింది.

1919లో, భారతదేశం రౌలట్ అనే అణచివేత చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుపుతోంది. ఈ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి ఎవరినైనా విచారణ లేకుండా నిర్బంధించే అధికారాన్ని ఇచ్చింది. ఏప్రిల్ 13న, బైసాఖీ పండుగ సందర్భంగా, పంజాబ్ లోని అమృత్‌సర్ లోని జలియన్ వాలాబాగ్‌లో భారీ సమావేశం జరిగింది. బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ డయ్యర్ నేతృత్వంలోని బ్రిటిష్ దళాలు ఈ సమావేశంపై కాల్పులు జరపాలని ఆదేశించాయి.

బ్రిటిష్ దళాలు సమావేశంపై 10 నిమిషాల పాటు కాల్పులు జరిపాయి. ఈ దాడిలో 379 మంది మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి, అయితే మరణించినవారి సంఖ్య 1000 కు పైగా ఉండవచ్చని భావిస్తున్నారు. చాలా మంది మహిళలు, పిల్లలు కూడా ఈ దాడిలో బలైపోయారు. జలియన్ వాలాబాగ్ ఊచకోత భారతదేశం అంతటా తీవ్రమైన ఆగ్రహానికి దారితీసింది. ఈ దురంతం భారతీయ స్వాతంత్ర్య పోరాటంలో ఒక మలుపుగా నిలిచింది. ఈ ఘటనకు నిరసనగా, మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 1920 సంవత్సరంలో ప్రారంభించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ బిరుదులను తిరిగి ఇచ్చారు. భగత్ సింగ్ విప్లవకారుడుగా మారడానికి ఈ సంఘటన ఒక కారణం.

జలియన్ వాలా బాగ్ ఊచకోత భారతీయుల స్వాతంత్ర్య కాంక్షను మరింత బలపరిచింది. జలియన్ వాలాబాగ్ ఊచకోత జ్ఞాపకార్థం, అమృత్‌సర్ లో ఒక స్మారకం నిర్మించబడింది. ప్రతి ఏడాది ఏప్రిల్ 13 న, భారతదేశం ఈ దురంతాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. జలియన్ వాలా బాగ్ ఊచకోత భారతీయ స్వాతంత్ర్య పోరాటంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. స్వతంత్ర ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఊచకోతకు కారణమైన బ్రిటిష్ అధికారులను శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. 1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్థూపాన్ని నిర్మించడానికి నాటి భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం చేసింది. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత 1961లో ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా జవహర్లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్థూపం ఆవిష్కరించబడింది.

(నేడు జలియన్ వాలాబాగ్ అమరులకు నివాళి)

- పూసపాటి వేదాద్రి

99121 97694

Next Story

Most Viewed