పంచాయతీ కార్మికులపై.. కనికరం చూపండి!

by Disha edit |
పంచాయతీ కార్మికులపై.. కనికరం చూపండి!
X

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర కీలకం. కానీ వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో, వారి సమస్యలన్నీ పరిష్కరించడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్న వారిని పర్మినెంట్ చేయడం లేదు. పర్మినెంట్ అయిన వారికి ప్రమోషన్లు కల్పించడం లేదు. మల్టీ పర్పస్ విధానంతో వారిపై పనిభారం పెంచుతున్నారు. విధులకు సంబంధం లేని పనులు చేయిస్తూ.. వారితో శ్రమ దోపిడీ చేయిస్తున్నారు. వారికి కనీస వేతనం ఇవ్వకపోవడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాల గురించి మర్చిపోయారు. ఫలితంగా చాలీ చాలని వేతనాలతో కార్మికులు అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే, తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ.. కార్మికులు సమ్మెకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించుకునే వరకూ సమ్మె విరమించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

హామీలిచ్చి విస్మరించి..

రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో సుమారు 60 వేల మంది కార్మికులు పారిశుధ్యం, పంప్ ఆపరేటర్లు, కారోబార్లు, ఎలక్ట్రీషియన్లు, బిల్ కలెక్టర్లు వంటి విభాగాల్లో పని చేస్తున్నారు. ఎండా, వానా, చలితో సంబంధం లేకుండా వీరు ప్రత్యక్షంగా 24 గంటల పాటు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇందులో నూటికి 80 శాతం మంది దళితులే ఉన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పంచాయతీ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందించారు. తమ రోజువారీ విధుల నిర్వహణతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పచ్చదనం పరిశుభ్రత ప్రోగ్రామ్‌ను కష్టపడి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన విధానంలో ముఖ్య భూమిక పోషిస్తున్న పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 2014, 2018లో జరిగిన ఎన్నికల సందర్భంగా పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని సీఎం కేసీఆర్ హామీనిచ్చారు, కానీ 9 ఏండ్లు గడుస్తున్నా నేటికీ చేయలేదు. జీవో 60 ప్రకారం కనీస వేతనం రూ.19 వేలు ఇవ్వాల్సి ఉన్నా ప్రస్తుతం రూ.8,500లు మాత్రమే ఇస్తున్నారు. పెరిగిన ధరలతో పోల్చితే వచ్చిన వేతనం సరిపోక కార్మికులు, వారి కుటుంబాలు అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి ఉన్నది.

విధుల్లో.. ఎన్నో ఇబ్బందులు

2019 ఎన్నికల సందర్భంగా పంచాయతీ కార్మికుల వేతనాలను నామమాత్రంగా పెంచింది. కానీ ఇదే సందర్భంలో వారిపై పనిభారం పెంచేందుకు.. జీవో 51ను రూపొందించి ఒకే కార్మికుడు అనేక పనులు చేయాలనే ‘మల్టీపర్పస్’ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంతో ఒక కార్మికుడు తమ విభాగం పనులు చేస్తూనే ఇంకా అనేక రకాల పనులు చేయాల్సి వస్తున్నది. దీనిని ఆయుధంగా తీసుకున్న సర్పంచులు కార్మికులతో అనేక పనులు చేయిస్తున్నారు. యంత్రాలు పెడితే డబ్బులు ఖర్చవుతాయనే ఉద్దేశంతో పంచాయతీ కార్మికులతోనే ఆ పనులు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతే కాకుండా.. కొన్ని చోట్ల సర్పంచుల ఇండ్లలో పాచి పనులూ చేయిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ఫలితంగా కార్మికులపై పని భారం పెరిగి వారు ఒత్తిడికి గురి కావాల్సి వస్తున్నది. అందుకే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో సుమారు 40 ఏండ్లుగా అనేక మంది కార్మికులు వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తూ ప్రమాదానికి గురైన వారు.. చనిపోయిన వారు ఉన్నారు. కానీ వారు చనిపోతే ప్రభుత్వం నుంచి అతని కుటుంబానికి ఎలాంటి నష్టపరిహారమూ అందదు. ఉద్యోగ విరమణ తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. ఇలా వారు ఎన్నో బాధలు పడుతున్నారు. అందుకే తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 6వ తేదీ నుంచి సమ్మె బాట పట్టారు. గ్రామంలో పనులన్నీ బంద్ చేసి పంచాయతీ ఆఫీస్‌ల ఎదుట నిరసన తెలుపుతున్నారు. వారి డిమాండ్స్ అయిన మల్టీ పర్పస్ విధానం రద్దు, కనీస వేతనం, ఉద్యోగం పర్మినెంట్, విధుల్లో చనిపోతే నష్టపరిహారం, చదువుకున్న కార్మికులను బిల్ కలెక్టర్లుగా, కారోబార్లుగా, పంచాయతీ సహాయకులుగా నియమించడం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం వంటివి కోరుతూ సమ్మె చేస్తున్నారు. గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడంలో ఇంత కష్టపడుతున్న వారి న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వం పరిష్కరించాలి.

మొహమ్మద్ నిసార్

- సీనియర్ జర్నలిస్ట్

95426 52786



Next Story

Most Viewed