పోడు హక్కులు- చిక్కులు

by Disha edit |
పోడు హక్కులు- చిక్కులు
X

పోడు భూముల సమస్యల పరిష్కారానికి ఆదివాసీలు ఇంకా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ చట్ట ప్రకారం క్లెయిమ్ నంబర్లు, భూమి పట్టాలు వచ్చాయి కానీ, హక్కు పత్రాలు రాలేదు. వీరికి ప్రభుత్వం రైతుబంధు ఇస్తుంది. ఫారెస్ట్ అధికారులు మాత్రం అవి అటవీ భూములంటూ సాగుదారులను అడ్డుకుంటున్నారు. కొంతమందికి క్లెయిమ్ నంబర్లు, పట్టాలు వచ్చినా రైతుబంధు రావడం లేదు. కొందరు అడవిలో తమకు కుదిరిన స్థలంలో కొంత, వేరే ప్రాంతంలో కొంత సాగు చేసి క్లెయిమ్ చేసుకున్నారు. చట్ట ప్రకారం ఒకే దగ్గర సర్వే చేసే ఆప్షన్ ఉంది. వారి భూముల పరిస్థితేంటి? అటవీ, అటవీ భూములు 1980 కంటే ముందు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. అపుడు సమస్య లేకుండా పట్టాలు ఇచ్చారు. 1980 తర్వాత ఈ భూములన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లాయి. రాష్ట్ర ప్రభుత్వం పట్టా ఇచ్చినా అటవీ శాఖ ఒప్పుకోవడం లేదు. ఈ భూమి దాదాపు 20 లక్షల ఎకరాలు ఉంటుందని అంచనా.

దివాసీలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసితులు తరతరాలుగా అడవి సంపద మీదనే ఆధారపడి బతుకుతున్నారు. అడవినే జీవితంగా భావించి, అడవిని పరిరక్షించుకుంటూ. అడవితోనే వారంతా మమేకమవుతున్నారు. అందుకే అడవినీ, ఆదివాసులనూ విడదీసి చూడలేము. అడవిని నమ్ముకొని పోడు చేసుకుంటున్న కుటుంబాలకు భూహక్కులు మాత్రం లభించడం లేదు. దీంతో అటవీ అధికారులకు ఆదివాసీలకు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

ఎన్నో ఉద్యమాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల పోడు భూములకు హక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం 1 జనవరి 2008 నుంచి 'అటవీ హక్కుల చట్టం-2006' అమలులోకి తీసుకొచ్చింది. మొదట ఆదివాసీలకే పరిమితమైన ఈ చట్టంలో తరువాత ఇతర సంప్రదాయక నిర్వాసితులనూ చేర్చారు. ఈ చట్టం అడవి ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు గిరిజనులు ఉన్న అన్ని ప్రాంతాలలోనూ అమలవుతుంది.

ఈ చట్టం ప్రకారం

అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం అటవీ భూములలో నివాసం ఉండటం, అటవీ భూమిని సాగు చేసుకోవడం, తేనె, బంక, లక్క, తునికాకు, ఔషధ మొక్కలు, అటవీ మొక్కలు సేకరించడం, చేపలు పట్టడం వంటి హక్కులను కల్పించారు. 13 డిసెంబర్ 2005 నాటికి సాగు చేసుకుంటున్న పోడు భూములకు గరిష్టంగా పది ఎకరాలకు పట్టా ఇస్తారు. ఆ తరువాత నుంచి సాగు చేసుకునే వారికి హక్కు పత్రం లభించదు. అలా చేసుకుంటుంటే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తారు. గిరిజనేతరులకు కూడా 13 డిసెంబర్ 2005 నాటికి అటవీ భూమి కనీసం మూడు తరాలు అంటే 75 సంవత్సరాల నుంచి సాగుచేస్తుంటే హక్కు పత్రం లభిస్తుంది. ఈ భూమిని వారసత్వం గానే అనుభవించాలి తప్ప బదలాయింపు చేయరాదు. అందుకే భార్య, భర్త, పిల్లల పేర జాయింట్ పట్టా ఇస్తారు. ఈ చట్టం అమలులోకి వచ్చాక తెలంగాణ ప్రాంతంలో పోడు హక్కుల కోసం వచ్చిన దరఖాస్తులు 2,04,176. వీటిలో 92,744 తిరస్కరించబడ్డాయి.

హక్కులు పొందినవారు 97,434. వీటితో పాటు 721 మంది సామూహిక హక్కులు పొందారు. దరఖాస్తులు ఎందుకు తిరస్కరించారో అధికారులు సరిగా వివరించకపోడంతో హక్కుల కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం గత యేడాది మరోసారి దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో దాదాపు 12 లక్షల 49 వేల ఎకరాలకు సంబంధించి 4 లక్షల 14 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిష్కారం కోసం గత నెల జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీని నియమించారు. ఇందుకోసం తెచ్చిన జీఓ-140 వివాదాస్పదం కావడంతో హైకోర్టు దానిని రద్దు చేసింది. ఇప్పటికే అటవీ హక్కుల కమిటీ, గ్రామ సభ, సబ్ డివిజన్ కమిటి, జిల్లా స్థాయి కమిటీ, రాష్ట్ర స్థాయి కమిటీలు ఉన్నందున ఈ జీఓ అసంబద్ధమని స్పష్టం చేసింది.

తీరని సమస్యలు

పోడు భూముల సమస్యల పరిష్కారానికి ఆదివాసీలు ఇంకా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ చట్ట ప్రకారం క్లెయిమ్ నంబర్లు, భూమి పట్టాలు వచ్చాయి కానీ, హక్కు పత్రాలు రాలేదు. వీరికి ప్రభుత్వం రైతుబంధు ఇస్తుంది. ఫారెస్ట్ అధికారులు మాత్రం అవి అటవీ భూములంటూ సాగుదారులను అడ్డుకుంటున్నారు. కొంతమందికి క్లెయిమ్ నంబర్లు, పట్టాలు వచ్చినా రైతుబంధు రావడం లేదు. కొందరు అడవిలో తమకు కుదిరిన స్థలంలో కొంత, వేరే ప్రాంతంలో కొంత సాగు చేసి క్లెయిమ్ చేసుకున్నారు. చట్ట ప్రకారం ఒకే దగ్గర సర్వే చేసే ఆప్షన్ ఉంది. వారి భూముల పరిస్థితేంటి? అటవీ, అటవీ భూములు 1980 కంటే ముందు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. అపుడు సమస్య లేకుండా పట్టాలు ఇచ్చారు. 1980 తర్వాత ఈ భూములన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లాయి. రాష్ట్ర ప్రభుత్వం పట్టా ఇచ్చినా అటవీ శాఖ ఒప్పుకోవడం లేదు. ఈ భూమి దాదాపు 20 లక్షల ఎకరాలు ఉంటుందని అంచనా. కొంతమందికి హక్కు పత్రాలు వచ్చినా, భూములను టైగర్, ఇరిగేషన్ జోన్‌లుగా, కోల్ ప్రాజెక్ట్‌గా మార్చారు. అందులో భూమి కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వలేదు.

క్లయిమ్ చేసుకున్న భూమిలో కొంత వరకే హక్కు పత్రం వచ్చినవి కోకొల్లలు. క్లెయిమ్ చేసుకున్న చోట కాకుండా, వేరే చోట హక్కు వచ్చినవారూ ఉన్నారు. చాలా వరకు వ్యక్తిగత హక్కుల కోసమే దరఖాస్తు చేసుకున్నారు. సామూహిక హక్కులుగా ఉన్న చెరువులు, రహదారులు, అటవీ గ్రామాల గుర్తింపు కోసం దరఖాస్తు చేయలేదు. గరిష్టంగా ఒక కుటుంబానికి పది ఎకరాలే అంటూ నిబంధన ఉండటంతో ఉమ్మడి కుటుంబాలు వేరు పడి సాగు చేసుకుంటున్నా రేషన్ కార్డులు లేకపోవడంతో వారి హక్కులను గుర్తించడం లేదు. గూగుల్ మ్యాప్ ఆధారంగా అటవీ భూములను గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు. మ్యాప్‌కీ, పోడు భూమికి పొంతన కుదరడం లేదని రైతులు వాపోతున్నారు. ఇలా పోడు హక్కుల గుర్తింపు అనేక చిక్కులతో ముడివడిపోయింది. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి శాశ్వత పరిష్కారాన్ని చూపాలి. లేదంటే పోడు భూముల సమస్య అపరిష్కృతంగా మిగిలిపోతుంది.


వాసం ఆనంద్ కుమార్

కేయూ, వరంగల్

94948 41254


Next Story

Most Viewed