చరిత్రను వక్రీకరించడం.. విద్యా సంస్కరణా..!?

by Disha edit |
చరిత్రను వక్రీకరించడం.. విద్యా సంస్కరణా..!?
X

భారతదేశంలో క్రీ.పూ. 7వ శతాబ్దం నుండే తాత్విక, సాంస్కృతిక అధ్యయన ఉద్యమాలు విస్తృతంగా వచ్చాయి. ఇందులో మౌఖిక, లిఖిత ఉద్యమాలు పరస్పర సంబంధితాలుగా, వైరుధ్యాలుగా కొనసాగాయి. వైదిక ఉద్యమాలకు ప్రత్యామ్నాయ ఉద్యమాలుగా చార్వాక, బౌద్ధ, జైన, సాంఖ్య ఉద్యమాలు వచ్చాయి. వైదిక ఉద్యమంలో ఎందరో ఆర్య ఋషులు పాల్గొన్నారు. వారిలో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి వారు ముఖ్యులు. చార్వాక ఉద్యమంలో చార్వాకులు, లోకాయతలు, భౌతికవాదులు ఎందరో పాల్గొన్నారు. వైదిక వాదులు ప్రకృతిని పూజిస్తే, చార్వాక వాదులు ప్రకృతిని జీవితానికి అన్వయిస్తూ విశ్లేషించారు. మానవుడు తనకీ ప్రకృతికీ, తనకీ సమాజానికీ ఉండే అంతఃస్సంబంధాన్ని వాస్తవ జ్ఞానం నుండి అర్థం చేసుకోగలుగుతారు. వాస్తవాలు, వాస్తవేతర అంశాలు భావనల ఘర్షణ నుండి తత్త్వశాస్త్రం, ఆధ్యాత్మిక వాదం పుట్టాయి. అందుకే భారతదేశంలో తాత్విక చర్చ జ్ఞానానికి దారితీసింది. భూమిలో నుండి నీటిని వేరు ద్వారా వృక్షానికి ఎలా అందిస్తుందో తత్వశాస్త్రం కూడా మనిషికి కావాల్సిన జ్ఞానాన్ని అందిస్తుంది.

పురాణాల్ని చరిత్రగా రూపొందిస్తూ..

జ్ఞానానికి జిజ్ఞాస, విచక్షణ పునాది. హేతు దృక్పథం ఆయువు. భారతదేశ ప్రాచీన తత్త్వవేత్తల్లో మిక్కిలి ప్రసిద్ధుడు కపిలుడు. అతని తాత్విక దృక్పథం అసమానమైనది. తనదంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న తత్త్వవేత్త ఆయన. కపిలుడు రూపొందించిన సాంఖ్య తత్త్వం ప్రకృతిని విశ్లేషించి మానవ జీవితానికి అన్వయిస్తుంది. కపిలుడు కార్యకారణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

ఇలా మహోన్నతమైన ప్రాచీన తాత్త్వికుల బోధనలను మన విద్యా వ్యవస్థలోకి జొనిపి ముందుకు తీసుకువెళ్ళాల్సిన విద్యా ప్రణాళికలు నేడు దారి మార్చి భారత రామాయణ, భాగవత కథల ద్వారా జ్ఞానాన్ని బోధించాలనుకోవడం అశాస్త్రీయమవుతుంది. ఈనాడు భారతదేశ పాఠ్య ప్రణాళికలో వస్తున్న మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. చరిత్రలో సామాజిక సాంస్కృతిక అంశాలను జోడించి రచించిన ప్రామాణిక పాఠ్యగ్రంథ కర్తలు డి.డి.కోశాంబి, రోమెల్లా ధాపర్, ఆర్.ఎస్.శర్మ, బిపిన్ చంద్ర, సతీష్ చంద్ర, ఉపేంద్ర గుప్త, బి.ఎస్.ఎల్.హనుమంతరావు, కంభంపాటి సత్యనారాయణ వంటి వారు. ఇలాంటి రచయితల గ్రంథాలను తోసిరాజని నెట్టివేసి పుక్కిట పురాణాల్ని చరిత్రగా రూపొందించడం భారతదేశ ఔన్నత్యాన్ని తగ్గించడమే.

మూలాలు మర్చిపోయే ప్రమాదం..

భారతదేశం చారిత్రకంగా చాలా సంపన్నమైనది. చరిత్రలో ముఖ్యంగా పురావస్తు శాస్త్రజ్ఞులు పాతరాతి, కొత్తరాతి కంచు, రాగి, ఇనుము యుగాలుగా విభజించారు. ఈ యుగాలన్నీ కూడా పునాదులు రూపొందించిన యుగాలే. దీనికి భారతదేశ మూలవాసులు ఈ యుగాల నిర్మాతలు. అయితే వారి చరిత్రను నెట్టివేయడం కోసం పౌరాణిక చరిత్రను ముందుకు తీసుకొచ్చారు. పౌరాణిక కథాకథనాలు వేరు. చరిత్ర వేరు. పౌరాణిక కథల్ని కథలుగా తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక వాదాన్ని వాదంగా తెలుసుకోవచ్చు. అందుకని చరిత్రను విస్మరించరాదు.

నిజానికి ప్రతి ఉత్పత్తి పరికరానికి ఒక చరిత్ర ఉంది. కుండకు చాలా చరిత్రే ఉంది. సింధూ నాగరికతలో దాని ప్రాధాన్యత బలంగా ఉంది. ఆహార సేకరణ దశ, ఆహార ఉత్పత్తి దశ ఇవి రెండూ చరిత్రలో చాలా ముఖ్యమైనవి. ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు సమన్వయం అయితే కానీ సామాజిక, భౌతిక జీవన నిర్మాణ చరిత్ర ఏర్పడదు. ఆ చరిత్రలో మానవ పరిణామ దశలు దాగుంటాయి. పురావస్తు శాస్త్రం దాగుంటుంది. సామాజిక శాస్త్రం దాగుంటుంది. ఈ మొత్తం చారిత్రక సంపదను మనం తోసిపుచ్చరాదు. మూలవాసుల్ని నిర్లక్ష్యం చేయడం కోసం చరిత్రను, భాషా శాస్త్రాన్ని, తత్వశాస్త్రాన్ని సాంప్రదాయక పాఠ్య గ్రంథ నిర్ణేతలు నిర్లక్ష్యం చేస్తున్నారు. దానివల్ల విద్యార్థులకు భారతదేశ మూలాలు తెలియకుండా పోతాయి.

రెండు వాదాలూ చదవండి..

భారత దేశ మూలాలను అర్థం చేసుకున్న వారు డా.బి.ఆర్.అంబేద్కర్. ఇవ్వాళ భారతదేశం వెనుకబడి ఉండడానికి కారణం వర్ణ వ్యవస్థ. అయితే భారతదేశంలో ఉన్న మేధావుల్లో మనుస్మృతి మూలాలను చదివినవారు అంబేద్కర్ ఒక్కరే. ముఖ్యంగా జాతీయోద్యమంలో ఉన్న గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాల గంగాధర్ తిలక్ వీరందరూ మనుస్మృతిని అనుసరించిన వారు. మనుస్మృతి భావాలను వ్యతిరేకించిన వారు సాహు మహారాజ్, మహాత్మా ఫూలే, డా.బి.ఆర్.అంబేద్కర్, లోహియా, పెరియార్ రామస్వామి నాయకర్,అయోధ్య దాస్ వంటి వారు. ఎదిరించిన వారిలో కూడా మూలాన్ని చదివిన వారు అంబేద్కరే. మనుస్మృతి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మొదలైన వేదాల సారం. అందుకే మనుస్మృతి మొత్తంలో వేదాల నుతే ఎక్కువ ఉంటుందనీ డా.బి.ఆర్.అంబేద్కర్ అన్నారు. అయితే ఆధునిక భారతీయ విద్యార్థులు గానీ, మొత్తం భారతీయులు గానీ రెండు వాదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండు వాదాలూ తెలుసుకుని భారతదేశ పురోభివృద్ధికి తమ జీవన శైలిని మలచుకోవలసిన అవసరం ఉంది. అందుకే భారత రాజ్యాంగ స్ఫూర్తి అన్ని తరగతుల ప్రజలకు అవసరం.

అదే విద్యా సంపన్నత..

భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఒకే ఓటు, ఒకే రాజ్యాంగ విలువ కూడా ఉన్నాయి. అలాగే తమ చరిత్రను తాము తెలుసుకునే హక్కు తమ హక్కుల్ని తాము తెలుసుకునే అవకాశం వల్ల వారి దేశీయత మరింత బలపడుతుంది. అంబేద్కర్ గొప్ప జాతీయవాదిగా సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ సమతుల్యతను రాజ్యాంగంలో పొందుపరిచారు. పరిపాలనలో గానీ, విద్యార్జన పద్ధతిలో గానీ అన్ని జాతులవారికీ, అన్ని భాషల వారికీ సమానావకాశాలు ఉండాలి. భారతదేశంలో ప్రధానంగా మాట్లాడుతున్న హిందీ, బెంగాలీ, గుజరాతీ, అస్సామీ, ఒరియా భాషలలోనూ తమిళ, తెలుగు, కన్నడ, మలయాళీ, ఓండ్ర భాషలలోనూ అనంత సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక సంపద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో మౌఖిక, లిఖిత భాషా జాతుల సంస్కృతులు ఉన్నాయి. అందుకే లౌకిక ప్రజాస్వామ్య దృక్పథంతో భారతదేశ చారిత్రక, తాత్త్విక అధ్యయనం సాగించడమే ఈనాటి విద్యా సంపన్నత అవుతుంది. భారత రాజ్యాంగ స్ఫూర్తితో చరిత్రను, తత్వశాస్త్రాన్ని, సాంకేతిక జ్ఞానాన్ని సమగ్రంగా అధ్యయనం చేసే వైపు పాలకవర్గం నడవాల్సిన చారిత్రక సందర్భమిది. అప్పుడే మేధావులు, విద్యార్థులు, సమాజం నూత్న పథంలో గమించవచ్చు. చరిత్రను వక్రీకరించడం, నిర్దిష్ట చరిత్రను లేకుండా చేయబూనడం విద్యా సంస్కరణలు అనిపించుకోవు.

డా. కత్తి పద్మారావు

దళిత ఉద్యమ నాయకుడు

98497 41695

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672



Next Story

Most Viewed