బీసీ రిజర్వేషన్ ప్రశ్నార్థకం

by Disha edit |
బీసీ రిజర్వేషన్ ప్రశ్నార్థకం
X

ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలన్నీ కులమతాలు, రిజర్వేషన్ మీద ఆధారపడి నడుస్తున్నాయి. అందుకే, రాష్ట్ర జనాభాలో 9.91 శాతం కలిగిన ఎస్టీ కులాలకు రిజర్వేషన్లు ఆరు శాతం నుంచి పది శాతానికి, మైనారిటీలకు నాలుగు శాతం నుంచి పన్నెండు శాతానికి పెంచాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. 15.45 శాతం ఉన్న ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ ఇస్తున్నప్పటికీ, అందులో ఒక వర్గానికి సరైన న్యాయం జరగడం లేదని భావనతో వర్గీకరణ కోరుతున్నారు. ఈ అంశం మీద రాజకీయాలను వేడెక్కించినా, ప్రభుత్వాలు మాత్రం మౌనం వహిస్తున్నాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం అగ్రకులాలలో పేదవారి కోసం ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్ వీకర్ సెక్షన్) పేర పది శాతం రిజర్వేషన్లను అమలులోకి తెచ్చింది. నిబంధనలు రూపొందించి 24 ఆగష్టు 2001న జీఓ నం. 244 విడుదల చేసింది. దీని ప్రకారం ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పొందాలంటే కుటుంబ వార్షికదాయం ఎనిమిది లక్షల లోపు ఉండాలి. సాగుభూమి ఐదెకరాలకు మించరాదు. చిన్న పట్టణాలలో 1000 చదరపు అడుగులు, నోటిఫైడ్ మున్సిపల్ ఏరియాలో 100 చదరపు గజాల లోపు విస్తీర్ణంలోనే ఇల్లు ఉండాలి.

నిబంధనలకు విరుద్ధంగా

ఈ నిబంధనలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్ని మార్గదర్శకాలను సరి చూడకుండా, కేవలం వార్షికాదాయం ఎనిమిది లక్షల లోపు ఉండేవారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నికర అస్తులను పట్టించుకోకుండా రిజర్వేషన్ అమలు చేయడం ఎంతవరకు సబబు? అలాంటప్పుడు నిబంధనలు దేనికి? రాష్ట్రంలో ఉన్న ఓసీలందరికీ పది శాతం రిజర్వేషన్స్ కల్పించవచ్చు కదా!ఒక్కసారి బీసీ కులాల రిజర్వేషన్స్ పరిశీలిస్తే రాష్ట్ర జనాభాలో 52 శాతం జనాభా కలిగిన 98 ఉప కులాలకు ఇస్తున్న రిజర్వేషన్ 25 శాతం.

అందులో బీసీ-సి వారికి ఒక శాతం పోగా, బీసీలకు దక్కుతోంది 24 శాతం మాత్రమే. జనాభాలో 15 శాతంగా ఉన్న బీసీ-ఎ వారికి 9 శాతం, జనాభాలో 15 శాతంగా ఉన్న బీసీ-బి వారికి 10 శాతం, జనాభాలో 28 శాతంగా ఉన్న బీసీ-డికు 7 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. బీసీ-డి లో అత్యధికంగా 14.02 శాతం కలిగిన ముదిరాజులకు దక్కే వాటా ఎంత? అనేది ఆలోచించాలి. రాష్ట్రంలో బీసీలు తీవ్ర అణిచివేతకు, సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయపరంగా తీవ్ర వెనుకబాటుతనానికి గురవుతున్నారు. జనాభాలో సగానికిపైగా ఉన్నన్నప్పటికీ బీసీలు కేవలం ఓటర్లుగానే పరిగణింపబడుతున్నారు. వివిధ రంగాలలో దక్కాల్సిన ఫలాలను పొందలేకపోతున్నారు.

వారి పరిస్థితి ఏమిటో?

రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. ఈడబ్ల్యూఎస్‌తో కలిపి 60 శాతం ఉన్నాయి. కుల సంఘాలు డిమాండ్ చేసినట్టుగా రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతే అవి 72 శాతానికి చేరుకుంటాయి. ఇలా పెంచుకునే వెసులుబాటు ఉన్నప్పుడు బీసీ కులాలను మరొకసారి అధ్యయనం చేయడానికి కమిషన్ వేసి, కులాలవారీగా ఆర్థిక స్థితిగతులను పరిశీలించి, విశ్లేషించి జనాభాపరంగా రిజర్వేషన్లు కల్పించాలి. ప్రత్యేకంగా ఒక కులానికి కాకుండా సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయపరంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్స్‌తో చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.ప్రస్తుతం తెలంగాణలో కొలువుల పండుగ నడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ రోస్టర్ విధానం ప్రకారం 100 కొలువులలో 28 శాతం జనాభా కలిగిన బీసీ-డి గ్రూప్ కు 5 జనరల్, 2 మహిళలకు కేటాయించారు. ఆర్థికంగా వెనకబడి 14 శాతం జనాభా కలిగిన ముదిరాజుల పరిస్థితి ప్రశ్నార్థకమే.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పూరించిన కొలువుల లెక్కలు కావాలని కుల సంఘ నాయకులు ఆర్టీఐ ప్రకారం అడిగితే, అందులో ముదిరాజులు 200 మంది కూడా లేనట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కొలువులను భర్తీ చేస్తుండడంతో వెనుకబాటుకు గురవుతున్న కులాలకు రిజర్వేషన్స్ అవసరం ఎంత ఉంటుందో వేరే చెప్పనక్కరలేదు. మేధావులు, నిపుణులు, న్యాయవాదులు, అధికారులు, కులసంఘాల నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరిపి అందరికీ మేలు జరిగేటట్టుగా ఆమోదకర నిర్ణయం తీసుకునేలా ప్రయత్నం చేయాలి. ఇందులో మీడియా ప్రముఖ పాత్ర పోషించాలి.

డా. పోలం సైదులు ముదిరాజ్, పీహెచ్‌డీ

94419 30361



Next Story

Most Viewed