24 ఫ్రేమ్స్: అర్థవంత సినిమా కావాలంటే అది తప్పదా?

by Ravi |
24 ఫ్రేమ్స్: అర్థవంత సినిమా కావాలంటే అది తప్పదా?
X

తొలి రోజులలో వ్యవసాయంలోనో, వ్యాపారంలోనో లేదా పరిశ్రమలలోనో విజయాలు సాధించిన వాళ్లు అధిక శాతం ఫిలిం ఇండస్ట్రీకి వచ్చారు. ఆయా రంగాల సంపాదనతో స్టూడియోలు కట్టి నిర్మాతలుగా మారారు. పెరుగుతున్న లాభాలూ, సినిమా గ్లామర్ కూడా కొంత మందిని నిర్మాతలుగా చేసిందనే చెప్పాలి. వాటాదారుల వ్యవస్థ కూడా వచ్చింది. తర్వాత చాలా కాలానికి ప్రపంచీకరణ ఫలితంగా కార్పొరేట్‌లు సినిమా రంగంలోకి వచ్చారు. సహకార రంగం వలె అనేక మంది సామాన్యులు కలిసి అనేక భాషలలో సినిమాలు నిర్మించే ప్రయత్నాలూ జరిగాయి. చందాలతోనూ పలు సినిమాలు నిర్మించారు. ఫలితంగా కొన్ని అర్థవంత సినిమాలు వచ్చాయి. ఆ ఒరవడి పది కాలాలపాటు నిలబడకపోవడమే విషాదం.

తెలుగు సినిమానే కాదు, భారతీయ సినిమా రంగమంతటా 'ట్రెండ్' అన్న మాట చాలా పాపులర్. ట్రెండ్, ట్రెండ్ సెట్టింగ్, ట్రెండ్ సెట్టర్ లాంటి మాటలను సినిమా వాళ్లు తరుచుగా వాడుతూ వుంటారు. ట్రెండ్ అంటే ఒక తరహా సినిమా వచ్చి గెలిచిందంటే చాలు అదే ఒరవడిలో పలు సినిమాలు రావడం. ఆ మాట సినిమాకు హైప్ తీసుకురావడానికి కూడా విస్తృతంగా వాడతారు. ఇప్పటి వాతావరణంలో ఈ ట్రెండ్ అన్నమాట భిన్న సందర్భంలో, భిన్న ధోరణిలో వాడుతున్నారు. గతంలో హీరోను లేదా ఒక జానర్ సినిమాను ఈ మాటతో ఊదరగొట్టే వాళ్లు.

ఇప్పుడు నడుస్తున్నది 'బడ్జెట్ ట్రెండ్' అంటే, పాపులర్ హీరో పేరు కంటే కూడా వంద కోట్ల సినిమా, రెండొందల కోట్ల సినిమా అంటూ సినిమా నిర్మాణ సమయంలోనే ప్రచారం చేయడం నేటి ఒరవడి, సందడి కూడా. ఇక విడుదలైన తర్వాత రోజుకు ఇన్ని కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరిందనేది ఇంకో ప్రచారాస్త్రం. ఇదో రకం ట్రెండ్. నిజానికి వ్యాపార సినిమా అంటేనే డబ్బు మాయ. ప్రచారం ఒక ట్రెండ్. దానిలో ఏది నిజమో, ఏది ఉత్తుత్తి ప్రచారమో ఎవరికీ తెలీదు. ఇన్‌కం టాక్స్, ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ లాంటి వాళ్లకు కూడా అర్థం కాని బ్రహ్మ పదార్థం ఈ సినిమాల పెట్టుబడి, వసూళ్ల వ్యవహారం. అదంతా మనకవసరం లేదు కానీ, సినిమా బాగుందా? అర్థవంతంగా వుందా లేదా? అన్నది మనకు ముఖ్యం. అంతేకాదు, వీక్షకులకు కనీస వినోదం అందించిందా లేదా? అన్నదీ అంతకంటే ప్రధానం కదా!

అనేక మార్పులతో ముందుకు

సినిమా నిర్మాణానికి సంబంధించి సాంకేతిక అంశాలలో అనేక మార్పులు వచ్చాయి. 8 ఎంఎం, 16 ఎంఎం, 35 ఎంఎం, సినిమా స్కోప్, 70 ఎంఎం, బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, స్టీరియో ఫోనిక్, డాల్బీ నుంచి అనేకానేక మార్పులకు లోనయింది సినిమా. FILM VIEWING EXPERIENCE లో ప్రగతిశీల మార్పులు వచ్చాయి. ఆధునిక సాంకేతికత ఎంతగా పెరుగుతూ వచ్చిందో, పెట్టుబడీ అంతే పెరుగుతూ వచ్చింది. సాంకేతిక పరికరాలతో పాటు ఇతర మౌలిక వసతుల విషయంలోనూ అంతే మార్పులు సంభవించాయి. ఫలితంగా సినిమాలకు పెట్టుబడి పెరిగింది. కార్పొరేట్ సంస్థలూ వచ్చి చేరాయి. దాంతో సినిమా రంగానికి నిర్మాతలు దూరమయ్యారు. స్టూడియోలు కనుమరుగయ్యాయి.

ఇప్పుడంతా కంపెనీల వ్యవహారం. నిర్మాణం నుంచి మొదలు పంపిణీ, ప్రదర్శన రంగాల దాకా కార్పొరేట్ రంగమే. దాంతో కళ కళాత్మకత అన్న మాటలకు అర్థం పోయి అంతా 'అర్థమే' అయిపోయింది. ఫలితంగా సామాన్యుడికి సినిమాకు వున్న కనెక్టివిటీ పోయింది. సినిమా పరాయిదై పోయింది. వ్యాపార సినిమాకు పెద్ద పోషకుడు అయిన సామాన్యుడు దూరం కావడంతో కలెక్షన్‌లు లేక అనేక సినిమాలు తిరుగు టపాలో వెనుతిరుగుతున్నాయనే చెప్పాలి. అదంతా ఒక వలయం.

Also read: 24 ఫ్రేమ్స్: జాతిని తట్టి లేపిన సినిమా

అలా మొదలైన నిర్మాణం

కేవలం సినిమా నిర్మాణ రంగానికి సంబంధించిన అంశాలనే పరిశీలించుకుంటే, తొలి రోజులలో వ్యవసాయంలోనో, వ్యాపారంలోనో లేదా పరిశ్రమలలోనో విజయాలు సాధించినవాళ్లు అధిక శాతం ఫిలిం ఇండస్ట్రీకి వచ్చారు. ఆయా రంగాల సంపాదనతో స్టూడియోలు కట్టి నిర్మాతలుగా మారారు. పెరుగుతున్న లాభాలూ, సినిమా గ్లామర్ కూడా కొంత మందిని నిర్మాతలుగా చేసిందనే చెప్పాలి. వాటాదారుల వ్యవస్థ కూడా వచ్చింది. తర్వాత చాలా కాలానికి ప్రపంచీకరణ ఫలితంగా కార్పొరేట్‌లు సినిమా రంగంలోకి వచ్చారు. సహకార రంగం వలె అనేక మంది సామాన్యులు కలిసి అనేక భాషలలో సినిమాలు నిర్మించే ప్రయత్నాలూ జరిగాయి. చందాలతోనూ పలు సినిమాలు నిర్మించారు. ఫలితంగా కొన్ని అర్థవంత సినిమాలు వచ్చాయి. ఆ ఒరవడి పది కాలాలపాటు నిలబడకపోవడమే విషాదం. ఇటీవల క్రౌడ్ ఫండింగ్ గురించి పలువురు మాట్లాడుతున్నారు. ఆ పేరు మీద కాదు కానీ, అలాంటి ప్రయత్నాలు మన దేశంలో చాలానే జరిగాయి.

సహకార వ్యవస్థ రూపంలో దేశంలో మొదటి ప్రయత్నం కేరళలో జరిగింది. సుప్రసిద్ధ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్ పుణే ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత త్రివేండ్రంలో తన మిత్రులతో కలిసి 'చిత్రలేఖ ఫిలిం సొసైటీ' 'చలచిత్ర సహకార సంఘం' ఏర్పాటు చేసారు. వీటి ద్వారా దేశ విదేశాల గొప్ప సినిమాలను ప్రదర్శించాలని, సినిమాలు నిర్మించాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే తన మొదటి సినిమా 'స్వయంవరం' రూపొందించారు. రెండున్నర లక్షల పెట్టుబడితో నిర్మితమైన ఈ సినిమాలో ప్రధాన పాత్రలను శారద, మధు పోషించారు. ఈ సినిమా జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డులను అందుకుంది. శారదకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది.

విరాళాలతో సినిమాలు

ఆ తర్వాత కేరళలోనే జాన్ అబ్రహం తన మొదటి సినిమా 'అగ్రహారిత్తుల్ కజుతై' తర్వాత సామాన్య ప్రజలు ఇచ్చిన చందాలతో 'అమ్మా అరియన్' సినిమా తీసారు. మిత్రులతో కలిసి 'ఒడిస్సీ' ఉద్యమం పేర ఉత్తమ సినిమాలను పల్లెలలో ప్రదర్శించే కార్యక్రమం చేపట్టారు. ఊరూరా తిరుగుతూ 16 ఎంఎం ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రతి ప్రదర్శన తర్వాత జోలె పట్టి జనం వద్ద చందా అడిగేవారు. జనం ఇచ్చిన సొమ్ముతో అద్భుతమైన 'అమ్మా అరియన్' అన్న సినిమా తీసారు. అది కూడా జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుని విలక్షణ సినిమా గా నిలబడింది. అంటే ఆ సినిమాకు నిర్మాతలు ప్రజలే. లక్షలాది మంది కలిసి నిర్మించిన 'మంథన్' సినిమాకు శ్యాం బెనగల్ దర్శకత్వం వహించారు.

శ్వేత విప్లవ పితామహుడిగా పేరొందిన వర్గీస్ కురియన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ అండ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ సంస్థ ఈ సినిమా నిర్మాణానికి ముందుకు వచ్చింది. అందులో ఉన్న ఐదు లక్షల మంది సభ్యులు తలా రెండు రూపాయల చొప్పున ఈ సినిమా నిర్మాణానికి ఇచ్చారు. దేశంలో అత్యధిక మంది CROWD FUNDING చేసిన సినిమాగా మంథన్ మిగిలి పోయింది. గిరీష్ కర్నాడ్, నసీరుద్దిన్ షా, స్మితా పాటిల్, అమ్రీష్ పూరి తదితరులు ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా పలు అవార్డులను అందుకుంది.

Also read: 24 ఫ్రేమ్స్ :మంచి ప్రేక్షకులు ఎట్లా రూపొందుతారు?

ఇక్కడా అనేక యత్నాలు

ఈ ప్రేరణతోనే కరీంనగర్‌లోనూ 'కరీంనగర్ ఫిలిం క్రియేటర్స్' పేరిట ఒక విఫలయత్నం జరిగింది. 'కరీంనగర్ ఫిలిం సొసైటీ' కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహిస్తూనే నిర్మాణ రంగంలోకి వెళ్లాలని చేసిన ప్రయత్నం ఇది. అప్పటికే నారదాసు లక్ష్మణ్‌రావు మిత్రులతో కలిసి 'విముక్తి కోసం' నిర్మించారు. జాన్ అబ్రహం చేసిన 'అమ్మ అరియన్' ప్రేరణతో 'కరీంనగర్ ఫిలిం క్రియేటర్స్' ఆలోచన ముందుకు వచ్చింది.

హరి పురుషోత్తమరావు లాంటివాళ్లతో సభలు, చర్చలు కూడా చేసాం. ప్రధానంగా డి. నరసింహారావు, నరెడ్ల శ్రీనివాస్, వారాల ఆనంద్, గోపు లింగారెడ్డి ముందున్నారు. నారదాసు పైన నిర్మాణ బాధ్యతలను పెట్టాలని నిర్ణయించాం. కానీ, అనేక ఇతర కార్యక్రమాల ఒత్తిడితో ఇది ముందుకు సాగలేదు. ఒక చరిత్రాత్మక సినిమా నిర్మాణం నిలిచిపోయింది. ఇట్లా CROWD FUNDING తో తెలుగులో కూడా కొన్ని యత్నాలు జరిగాయి. వాటిలో ముఖ్యమైంది ఫణీంద్ర దర్శకత్వం వహించిన 'మను' సినిమా. మరిన్ని మంచి సినిమాలు CROWD FUNDINGలో రాగలిగితే నిర్మాణ వ్యయం విషయంలో పోటాపోటీ తగ్గుతుందని, అర్థవంత సినిమాలు వచ్చే వీలు ఉంటుందని భావించవచ్చు.


-వారాల ఆనంద్

94405 01281

Next Story

Most Viewed