లెక్కలతో మస్కా.. వ్యవసాయ శాఖపై అనుమానాలు

by  |
Agriculture
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదికలు రైతులను అయోమయంలో పడేస్తున్నాయి. యాసంగి సీజన్​ప్రకారం బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 39,761 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు వెల్లడించారు. గత ఏడాది ఇదే సమయానికి 1,31,119 ఎకరాల్లో వరి సాగైంది. కానీ ఈసారి గణనీయంగా తగ్గింది. ఓ వైపు ప్రభుత్వం వరి సాగు చేయవద్దని, యాసంగి ధాన్యం కొనుగోలు చేయమంటూ స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు వరిసాగు చేయడం లేదంటూ వ్యవసాయ శాఖ నివేదికలు చెప్పుతున్నాయి. కానీ గ్రామస్థాయిల్లో వరిసాగు సాధారణంగానే సాగుతుందని పలువురు రైతులు చెబుతున్నారు.

దాస్తున్నారా..?

ప్రస్తుతం రాష్ట్రంలో యాసంగి ప్రణాళిక లేకుండా పోయింది. సీజన్‌కు ముందే ప్రతి సీజన్‌లో సాగు ప్రణాళిక విడుదల చేస్తారు. కానీ ఈసారి చేయలేదు. ఇదే సమయంలో ధాన్యం కొనుగోలు చేయమంటూ రాష్ట్రం ప్రకటించింది. దీంతో వరిసాగుపై రైతులు వెనకాడుతున్నారంటూ వ్యవసాయ శాఖ వ్యూహం ప్రకారం ప్రచారం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది సాగుకు, ఇప్పుడు చూపిస్తున్న సాగుకు చాలా వ్యత్యాసం ఉంటోంది. అయితే ఇటీవల రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లోపే వరి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ ఓ ప్రత్యేక నివేదికను సీఎంకు ఇచ్చినట్లు తెలుస్తోంది. రైతులను ఒక విధమైన భయంలో పెట్టి వరి సాగును తగ్గిస్తామని చెప్పుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వరి సాగు చేయడం లేదనే సంకేతాలు ఇచ్చేందుకే సాగు నివేదికల్లో తక్కువ చూపిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి.

ప్రత్యామ్నాయ పంటలూ అంతే

వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పుతున్నా.. రైతులు కొన్నిచోట్ల వినడం లేదు. అయితే వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం ప్రత్యామ్నాయ పంటలు కూడా తక్కువగానే సాగు అవుతున్నాయి. బుధవారం నాటి నివేదిక ప్రకారం మొక్కజొన్న సాధారణ సాగు 1.77 లక్షల ఎకరాలు ఉంటే.. ఇప్పటి వరకు 1.58 లక్షల ఎకరాల్లో సాగైంది. అదే విధంగా వేరు శనగ సాగు గత యాసంగిలో ఈ సమయానికి 2.68 లక్షల ఎకరాలు సాగు చేస్తే ఇప్పుడు 3.06 లక్షలకు చేరింది. పల్లి సాగు మాత్రం కొంత మేరకు పెరిగింది. గత సీజన్‌లో ఈ సమయానికి 1.76 లక్షలు సాగు చేస్తే ఇప్పుడు 2.99 లక్షల ఎకరాలకు చేరింది. వరి సాగు తగ్గినట్లుగా చూపిస్తున్నా.. ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగు మాత్రం అందుకనుగుణంగా పెరగడం లేదు. దీంతో సీఎం మెప్పు కోసమే వ్యవసాయ శాఖ తప్పుడు నివేదికలు ఇస్తుందనే విమర్శలు సైతం మూటగట్టుకుంటుంది. కాగా రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో ఈ సమయానికి సాధారణ సాగు 10.08 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పుడు 10.27 లక్షల ఎకరాలకు చేరినట్లు వ్యవసాయ శాఖ నివేదికల్లో పేర్కొన్నారు.


Next Story