నీలిరంగు వేప చెక్కతో అమ్మవారి విగ్రహం.. ఆ ఆలయంలో అంతుచిక్కని రహస్యాలు మరెన్నో..

by Disha Web Desk 20 |
నీలిరంగు వేప చెక్కతో అమ్మవారి విగ్రహం.. ఆ ఆలయంలో అంతుచిక్కని రహస్యాలు మరెన్నో..
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలతో అనేక పౌరాణిక, లౌకిక కథలు ముడిపడి ఉన్నాయి. అంతే కాదు ఎన్నో అద్భుతాలు, అంతుచిక్కని రహస్యాలు ఆలయాల్లో దాగి ఉన్నాయి. అలాగే భారతదేశంలోని ప్రతి ఆలయానికి కొన్ని కథలు, ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు ఇతర దేవాలయాల కంటే భిన్నంగా ఉంటాయి. అలాంటి ఆలయాలలో ఒకటి పశ్చిమ బెంగాల్‌లోని హంగేశ్వరి ఆలయం. మరి ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పశ్చిమ బెంగాల్‌లో దుర్గామాతను అత్యంత వైభవంగా పూజిస్తారు. అంతేకాకుండా ఇక్కడ జరుపుకునే దుర్గాపూజ పండుగ దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. హంగేశ్వరి ఆలయం కలకత్తా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో హుగ్లీ జిల్లాలో బన్సి బెరియాలో ఉంది. ఈ ఆలయ నిర్మాణ పనులను నృసింహదేబ్ రాయ్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన భార్య రాణి శంకరి ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేశారు.

19వ శతాబ్దపు వాస్తుశిల్పం..

హంగేశ్వరి ఆలయాన్ని హంసేశ్వరి ఆలయం అని కూడా అంటారు. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఈ ఆలయంలో కాళీ మాత దర్శనం ఇస్తారు. ఈ ఆలయం 19వ శతాబ్దపు శిల్పకళను ప్రతిబింబించేలా నిర్మించారు. ఈ ఆలయం 21 మీటర్ల ఎత్తు, 13 మినార్లను కలిగి ఉంది. ప్రతి శిఖరం తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. తాంత్రిక సూత్రాలతో నిర్మించిన ఈ ఐదు అంతస్తుల ఆలయం మానవ శరీర నిర్మాణాన్ని అనుసరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ నవరాత్రి రోజుల్లో, ఋషులు, సాధువులు తంత్ర సాధన చేస్తారని పండితులు చెబుతున్నారు. ఆలయంలోని ప్రతి స్తంభం పైభాగంలో కమలం వంటి ఆకారం ఉంటుంది. ఆలయం లోపల ఉన్న కళాఖండాలు మానవ జీవితంలోని వివిధ దశలను వర్ణిస్తాయి.

అమ్మవారి విగ్రహం ప్రత్యేకత..

హంగేశ్వరి ఆలయంలో కాళీ మాత దర్శనం ఇస్తారు. ఇతర దేవాలయాలలోని విగ్రహాల కంటే భిన్నంగా ఈ ఆలయంలోని విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం నీలిరంగు వేప చెక్కతో తయారు చేశారు. ఈ నిర్మాణం మొత్తం ఎత్తు 21 మీటర్ల వరకు ఉంటుంది.

శక్తితో శివ దర్శనం..

ఈ ఆలయంలో శివుడు, శక్తి ఇద్దరూ దర్శనం ఇస్తారు. కాబట్టి ఈ ఆలయాన్ని హంగేశ్వరి అని పిలుస్తారు. శక్తి విగ్రహం నీలిరంగు వేప చెక్కతో చేయగా, శివుని శివలింగం తెల్లని పాలరాతితో చేశారు.


Next Story