డెంగీ డేంజర్… సిటీలోని సగం నాలాల్లో దోమల జోరు

by  |
Dengue Danger
X

దిశ, తెలంగాణ బ్యూరో : పట్టణ ప్రాంతాల్లో డెంగీ వ్యాధి విజృభిస్తోంది. హైదరాబాద్ తో పాటు వనపర్తి, మేడ్చల్, నిర్మల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లోని సగం నాలాల్లో దోమల జోరు కొనసాగుతోంది. దీంతో ఆయా జిల్లాల పరిధిలో లార్వా సాంద్రత పెరిగి డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయని ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి తెలిపింది. నివారణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఆ దిశగా కృషి చేయడం లేదు. ఫలితంగా అర్బన్ ఏరియాల్లో దోమల బెడద తప్పడం లేదు. దీంతో బయటకు వెళ్లాలంటే కరోనా భయం, ఇంట్లో ఉంటే డెంగీ ఫీయర్ తో జనాలు అల్లాడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా అధికారింగా 1206 కేసులు దాటిపోయాయి. అనాధికారికంగా వీటి సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు సమాచారం.

పెరిగిన దోమల సాంద్రత..

ఎంటమాలాజికల్ విభాగం గణాంకాల ప్రకారం హైదరాబాద్ లో అత్యధికంగా 46 శాతం లార్వా వృద్ధి చెందగా, వనపర్తిలో 44.6, మేడ్చల్‌లో 41, నిర్మల్‌లో 41, రంగారెడ్డిలో 39.9, మహబూబ్ నగర్‌లో 39.5, ఆదిలాబాద్‌లో 36.5, వరంగల్‌లో 34.4, నిజామాబాద్‌లో 34, నారాయణపేట్‌లో 31, సంగారెడ్డిలో 31.5, ఖమ్మంలో 31, కొత్తగూడెంలో 28.5, నల్లగొండలో 26, సూర్యాపేటలో 26, మంచిర్యాలలో 24, మెదక్ లో 24, కామారెడ్డిలో 23.5, నాగర్ కర్నూల్ లో 22.5, వరంగల్ రూరల్ లో 21.8, జగిత్యాలలో 21, ములుగులో 21, మహబూబాబాద్‌లో 18.5, సిద్ధిపేట్‌లో 18.5, కరీంనగర్‌లో 17.5, ఆసీఫాబాద్‌లో 16.3, పెద్దపల్లిలో 16, యాదాద్రిలో 15.8, గద్వాలలో 15.5, వికారాబాద్‌లో 15.5, జనగామాలో 14, భూపాలపల్లిలో 13.5, సిరిసిల్లలో 12.5 శాతం లార్వా తేలినట్లు ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి తెలిపింది. అయితే గతేడాదితో పోల్చితే ప్రతీ జిల్లాలో సగటున పది శాతం చొప్పున పెరిగినట్లు వివరించింది.

ఆసుపత్రుల్లో డెంగీ కిట్లు సిద్ధం…

ప్రతీ రోజూ డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో డెంగీ కిట్లను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఫీవర్, నిలోఫర్, ఉస్మానియా, గాంధీలో కిట్లు అందుబాటులో ఉండగా, తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లలోనూ కిట్లను సమకూర్చుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేగాక కొన్ని ఏరియా ఆసుపత్రుల్లోనూ సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. లక్షణాలు తేలిన 5 రోజుల్లో చేసే ఎన్ఎస్ఐతో పాటు ఐజీఎమ్, ఐజీజీ యాంటీబాడీ కిట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

ప్లేట్ లెట్‌ల పరేషానీ…

డెంగీ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో ప్లేట్ లెట్‌ల కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా ప్రభావంతో డోనర్లు దొరకడం కష్టమని స్వయంగా డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ 24 ప్రభుత్వాసుపత్రుల్లో సింగిల్ డోనర్ ప్లేట్ లెట్ మిషన్లను ఏర్పాటు చేసినా, దాతలు లేకపోతే ప్లెట్ లెట్‌ల బాధితులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

20 వేల కంటే తక్కువుంటేనే ఎక్కించాలి: డా శంకర్, ఐపీఎం డైరెక్టర్

Dengue

సాధారణంగా మానవుని శరీరంలో లక్షా 50 వేల నుంచి గరిష్ఠంగా 4.50 లక్షల వరకు ప్లేట్ లెట్‌లు ఉంటాయి. అంతకంటే తక్కువున్న ప్రతీసారి ప్లేట్ లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు. అంతేగాక డెంగీ సోకిన ప్రతి ఒక్కరికి ప్లేట్ లెట్స్ అవసరం లేదు. వీటి సంఖ్య 20 వేల కంటే తక్కువుంటనే ఎక్కించాలి. ఇక 10 వేల కంటే తక్కువుంటే ఖచ్చితంగా ఎక్కించాలి. అంతేగాక 50 వేలు ఉండి బ్లీడింగ్ అవుతున్న సందర్భాల్లోనూ కొన్ని సార్లు ఎక్కించాల్సి వస్తుంది. అయితే డెంగీకి ప్రత్యేకమైన మందులు లేనందున అత్యంత జాగ్రత్తతో సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేదంటే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉన్నది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్లేట్ లెట్‌ల మిషన్లను అందుబాటులో ఉంచాం. అక్కడ చేరిన వారికి స్వయంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న బ్లడ్ బ్యాంక్‌ల నుంచి ప్లేట్ లెట్‌లు అందిస్తున్నాం. 102 జ్వరం, డీ హైడ్రేషన్, సీవియర్ తలనొప్పి ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.



Next Story

Most Viewed