ద‌ళిత పూజారి వంగూరి ముత్త‌య్య ఇకలేరు!

by Sridhar Babu |
ద‌ళిత పూజారి వంగూరి ముత్త‌య్య ఇకలేరు!
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో రామాలయం ప్ర‌ధాన పూజారి వంగూరి ముత్త‌య్య మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు. ఆయ‌న దాదాపు 25 ఏళ్లుగా ఆల‌యంలో ప్ర‌ధాన అర్చకులుగా కొన‌సాగుతున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు. నాటి నుంచి ఆయ‌న మ‌న‌వ‌డు అనంత రాములు విధులు నిర్వర్తిస్తున్నారు.

వ‌ల్ల‌భి రామాల‌యం తొలి పూజారిగా ముత్తయ్య తండ్రి వంగూరి రామస్వామి ప‌నిచేశారు. దళితులకు ప్రత్యేకంగా దేవాలయం ఉండటం..దానికి దళితుడే పూజారిగా కొనసాగడం అరుదైన విషయం. ప్రస్తుత పూజారి అనంత రాములు టీటీడీలో శిక్ష‌ణ పొంది రావడం గ‌మ‌నార్హం. ఆరు దశాబ్దాల కిందట వ‌ల్ల‌భి గ్రామంలో ద‌ళితుల‌ ఆల‌య ప్ర‌వేశం పై కొంత‌మంది పెత్త‌ందార్లు ఆంక్షలు విధించారు.

దీంతో ద‌ళితుల‌కు ప్ర‌త్యేకంగా ఓ ఆల‌యం ఉండాల‌ని భావించిన వంగూరి రామ‌స్వామి తన ఆస్తుల‌ను అమ్మి ఆలయం నిర్మించారు. అర్చ‌న చేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డంతో తానే స్వ‌యంగా వేదాలు నేర్చుకుని నిత్యం స్వామివారికి కైంక‌ర్య సేవ‌లు నిర్వ‌హించ‌డం విశేషం. మొద‌ట్లో వ్య‌తిరేక‌త వ‌చ్చినా ఆ త‌ర్వాత స‌క‌ల జ‌నులు ఆల‌యానికి వచ్చారు. ఆరు ద‌శాబ్దాలుగా రామ‌స్వామి వారుసులే ఈ ఆల‌యంలో పూజ‌లు చేస్తూ వ‌స్తున్నారు.



Next Story

Most Viewed