లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: (జాతీయం, నియామకాలు)

by Disha Web Desk 17 |
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: (జాతీయం, నియామకాలు)
X

జాతీయం:

రేడియా ప్రసారాల్లో ఇక మీదట ఆకాశవాణి పేరు :

రేడియో ప్రసారాల సమయంలో ఇక నుంచి కేవలం ఆకాశవాణి పేరు మాత్రమే ఉపయోగించాలని ఆకాశవాణి డీజీ వసుధా గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. రేడియోల్లో ప్రకటనల సమయంలో కానీ, ఇతర వర్తమానాల్లో కానీ కేవలం ఆకాశవాణి పేరు మాత్రమే ఉపయోగించాలని నిర్దేశించారు. ఇంగ్లీష్ ప్రసారాల సమయంలో కూడా దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో అని కాకుండా దిస్ ఈజ్ ఆకాశవాణి అని మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు. అన్ని భాషల్లోనూ ఇదే నిబంధన అనుసరించాలని నిర్దేశించారు.

రైల్ వికాస్ నిగమ్‌కు నవరత్న హోదా:

రైల్వే శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్ఎల్)కు కేంద్ర ప్రభుత్వం నవరత్న హోదా ప్రకటించింది. ఈ సంస్థ 2003 జనవరి 24న ఏర్పాటయింది. రైల్వే సామర్థ్యాన్ని పెంచే మౌలిక వసతులను వేగవంతంగా అమలు చేయడంతో పాటు, స్పెషల్ పర్పస్ వెహికల్ ప్రాజెక్టులకు బడ్జెటేతర మార్గాల్లో నిధుల సమీకరణ చేసేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 2005 నుంచి ఇది తన కార్యకలాపాలను ప్రారంభించింది. 2013లో దీనికి మినీరత్న హోదా దక్కింది.

దీనికి నవరత్న హోదా కట్టబెట్టడం వల్ల నిర్ణయాధికారాలు పెరుగుతాయి. నిర్వహణ స్వతంత్రత, ఆర్థిక స్వయం ప్రతిపత్తి పెరుగుతాయి. దీంతో ఈ సంస్థ పనితీరు మరింత వేగాన్ని పుంజుకోనుంది. ఇప్పటివరకు దేశంలో 14 నవరత్న సంస్థలున్నాయి.

భారత్‌లో 76 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు:

భారత జనాభాలో ఇంటర్నెట్ క్రియాశీలక వినియోగదారుల సంఖ్య తొలిసారిగా 50 శాతం దాటింది. 2022 నాటికి దేశ జనాభాలో 75.9 కోట్ల మంది (నగర, గ్రామీణ ప్రాంతాలు ) నెలలో కనీసం ఒక్కసారైనా ఇంటర్నెట్ వాడుతున్నట్లు తాజాగా ఓ నివేదికలో తేలింది. ఇంటర్నెట్ ఇన్ ఇండియా - 2022 పేరిట ఐఏఎంఏఐ, కాంటార్ సంస్థలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. డిజిటల్ చెల్లింపులు 2021 తో పోలిస్తే 2022లో 13 శాతం వృద్ధి నమోదై 33.8 కోట్ల మంది వినియోగదారులకు చేరాయి. ఇందులో 35 శాతం మంది గ్రామీణులున్నారు.

ప్రపంచ మీడియా స్వేచ్ఛా దినోత్సవం 2023:

మీడియా స్వేచ్ఛలో భారత్ మరింత దిగువకు పడిపోయింది. ప్రపంచ మీడియా స్వేచ్ఛా సూచీ - 2023లో 161వ స్థానానికి పరిమితమైంది. గతేడాది 150వ స్థానంలో ఉన్న భారత్ ఈ సారి 11 ర్యాంకులు పడిపోయి 161 కి చేరింది. రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) అనే గ్లొబల్ మీడియా వాచ్‌డాగ్ ప్రతీ ఏడాది ప్రపంచ మీడియా దినోత్సవం సందర్భంగా ఈ స్వేచ్ఛా సూచీని ప్రచురిస్తుంటుంది. మొత్తం 180 దేశాలకు ర్యాంకులను కేటాయిస్తుంది.

తెలంగాణ సచివాలయానికి గోల్డ్ రేటింగ్:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక హంగులతో పర్యావరణ హితంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయానికి గోల్డ్ రేటింగ్ లభించింది. గోల్డ్ రేటింగ్ పురస్కారం, ధ్రువపత్రాన్ని నూతన సచివాలయంలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి భారతీయ హరిత భవన మండలి (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ - ఐజీబీసీ) ప్రతినిధుల బృందం అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే గోల్డ్ రేటింగ్ పొందిన తొలి సచివాలయం తెలంగాణ సచివాలయం అని అన్నారు.

నియామకాలు:

కోల్ ఇండియా సీఎండీగా మల్లికార్జున ప్రసాద్:

ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా పోలవరపు మల్లికార్జున ప్రసాద్ పేరును, ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక బోర్డు సిఫార్సు చేసింది. ప్రస్తుతం కోల్ ఇండియా అనుబంధ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ సీఎండీగా ప్రసాద్ పనిచేస్తున్నారు.

వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా:

ప్రపంచ బ్యాంక్ కొత్త అధ్యక్షుడిగా అజయ్ బంగా నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించనున్న తొలి భారతీయ అమెరికన్‌గా ఆయన నిలిచారు. ఈ ఏడాది జూన్ 2 నుంచి ఐదేళ్ల పాటు బంగా పదవిలో కొనసాగుతారని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఫిబ్రవరిలో బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అమెరికా నామినేట్ చేస్తున్నట్లు జో బైడెన్ ప్రకటించారు.


ఇవి కూడా చదవండి:

పోటీ పరీక్షల ప్రత్యేకం.. 1857 సిపాయిల తిరుగుబాటు

అలర్ట్: బీసీ గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ విడుదల


Next Story

Most Viewed