మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

by Malleboina Mahesh |

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా అమల్నేర్ వద్ద కారు, బైక్, బస్సు ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఓ బైక్ ను, బస్సును ఢీకొట్టడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. భయంకరమైన రోడ్డు ప్రమాదంలో ఆరు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. అమల్నేర్ సమీపంలోని లోంధే ఫాటా వద్ద వేగంగా వచ్చిన కారు, మోటార్ సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ త్రిముఖ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన కొందరు సభ్యులు ఒక నిశ్చితార్థ వేడుకకు (Engagement Ceremony) హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. జల్గావ్ జిల్లాలోని అమల్నేర్ సమీపానికి చేరుకోగానే ఉదయం 7 గంటల ప్రాంతంలో వీరి కారు ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది.

కారు ఢీ కొట్టిన వేగానికి ఆ బైక్ పల్టీలు కొడుతూ, వ్యతిరేక దిశ నుంచి వస్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ దారుణ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నందలాల్ మహాజన్, అనితా మహాజన్, సురేష్ మహాజన్, నిర్మలా మహాజన్ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మోటార్ సైకిల్‌పై ఉన్న నిలేష్ తావడే, ఫల్గుణి భోయ్ అనే ఇద్దరు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. కారు నడుపుతున్న డ్రైవర్ ఆదిత్య మహాజన్ కాళ్లకు తీవ్రమైన ఫ్రాక్చర్లు కావడంతో అతడిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, పోలీసులు, వైద్య అత్యవసర సిబ్బందికి సహాయం చేస్తూ సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story