బ్యాంకు దొంగ‌లు చిక్కారు..!

by Aamani |
బ్యాంకు దొంగ‌లు చిక్కారు..!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండ‌లకేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో దోపిడీకి పాల్ప‌డిన అంతఃరాష్ట్ర ముఠాలోని ముగ్గురు స‌భ్యుల‌ను వ‌రంగ‌ల్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడితో సహా మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన అర్షాద్‌ అన్సారీ, షాఖీర్‌ఖాన్‌ ఆలియాస్‌ బోలెఖాన్ , హిమాన్షు బిగాం చండ్‌ జాన్వర్‌లున్నారు. పరారీలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌కు చెందిన‌ మహమ్మద్‌ నవాబ్‌ హసన్, సాజిద్‌ ఖాన్‌, మ‌హారాష్ట్ర‌కు చెందిన అక్షయ్‌ గజానన్‌ అంబోర్‌, సాగర్‌ భాస్కర్ గోర్‌ల కోసం వ‌రంగ‌ల్ పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. అరెస్టు చేసిన ముగ్గురు దొంగ‌ల నుంచి సుమారు కోటి ఎనబై లక్షల నాలగువేల రూపాయల విలువైన రెండు 2కిలోల 520 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు, పదివేల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్ ఝా త‌న కార్యాల‌యంలో నిందితుల అరెస్టును చూపారు.

క‌మిష‌న‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం...న‌వంబ‌ర్ 18న అర్ధ‌రాత్రి స‌మ‌యంలో రాయ‌ప‌ర్తి ఎస్‌బీఐ బ్యాంకులో దొంగ‌త‌నానికి పాల్ప‌డిన అంతఃరాష్ట్ర ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులతో పాటు, పరారీలో మరో నలుగురు నిందితులు ఏడుగురు సభ్యులు ముఠాగా ఏర్ప‌డి ప‌లుచోట్ల దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డిన‌ట్లు గుర్తించామ‌ని అన్నారు. పరారీలో వున్న ప్రధాన నిందితుడు మహమ్మద్‌ నవాబ్‌ హసన్‌ కొద్ది రోజుల కిందిత ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉండే బ్యాంక్‌లు, బ్యాంక్‌ భద్రత ఏర్పాట్లపై రెక్కీ నిర్వహించిన‌ట్లు తెలిపారు. అనంతరం నిందితుడు ఉత్తర ప్రదేశ్‌, మహరాష్ట్రలకు చెందిన మిగితా నిందితుల కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వ్యాపారం ముసుగులో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ముఠా ముందుగా గుగూల్‌ ద్వారా మారూమూల ప్రాంతాల్లోని బ్యాంకుల సమాచారాన్ని సేకరించడం జరిగింది. సేకరించిన సమచారంలో నిందితులు వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఎస్‌బిఐ బ్యాంక్‌ చోరీ అనువైనదిగా గుర్తించారు. ఈ బ్యాంక్‌లో చోరీ చేసేందుకు ఈ ముఠా సిద్దపడ్డారు. ఈ చోరీలో భాగంగా నవంబర్‌ 18తేది ఆర్థ్రరాత్రి తెలవారితే 19 తారీకున నిందితులు హైదరాబాద్‌ నుంచి నిందితుల్లో ఒకడైన హిమాష్షు డ్రైవింగ్‌ చేస్తున్న ఒక కారులో రాయపర్తి గ్రామ శివారు ప్రాంతాని చేరుకున్నారు. అనంతరం కారును తిరిగి తెల్లవారుజామున నాలుగు గంటలకు రమ్మని కారుని వెనక్కి తిప్పి పంపారు.

అనంతరం మిగ‌తా ఆరుగురు నిందితులో పంట పోలాల ద్వారా నిందితులు రాయపర్తి కేంద్రంలోని ఎస్‌బిఐ బ్యాంక్‌ దక్షిణ భాగానికి రాత్రి 11 గంటలకు చేరుకున్నారు. అక్కడ వున్న కిటీకిని తొలగించి బ్యాంక్‌ లోనికి చొర‌బ‌డ్డారు. ఈ ముఠా సభ్యులు ముందుగా బ్యాంక్‌ సెక్యూరీటీ అలారంతో పాటు, సీసీ కెమెరాల వైర్లను కట్‌ చేసి ఇద్దరు కిటీకి వద్ద కాపలాగా ఉన్నారు. ప్రధాన నిందితుడితో సహ మరో నలుగురు నిందితులు బ్యాంక్‌ స్ట్రాంగ్‌ రూం తాళాలు పగులగొట్టి, స్ట్రాంగ్‌ రూంలో వున్న మూడు లాకర్లను గ్యాస్‌ కట్టర్లను వినియోగించి లాకర్లను తొల‌గించారు. సుమారు రూ.13 కోట్ల 61 లక్షల విలువ గల బంగారు అభరణాలను తీసుకుని వెళ్ళిపోయారు. వారి వెంట తెచ్చుకున్న గ్యాస్‌ సిలిండర్‌ ఇతర సామ‌గ్రిని వదిలి వేశారు. వెళ్తూ వెళ్తూ సీసీ కెమెరాల డీవీఆర్‌ను ఎత్తుకెళ్లారు. చోరీ అనంతరం నిందితులు వచ్చిన కారులో తిరిగి హైదరాబాద్‌ కిరాయి తీసుకున్న ఇంటికి చేరుకున్నారు. అక్క‌డ చోరీ సోత్తును ఏడు సమాన వాటాలుగా పంచుకున్నారు. నవంబర్‌ 19వ తేదిన నిందితులు మూడు బృందాలుగా వీడిపోయి త‌మ సొంత రాష్ట్రాలైన‌ మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల‌కు వెళ్లిపోయారు.

ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌ వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ నేతృత్వంలో వర్థన్నపేట ఏసీపీ నర్సయ్య, సీసీఎస్ ఏసీపీ భోజరాజు, నర్సంపేట ఏసీపీ కిర‌ణ్‌కుమార్ ల ఆధ్వర్యంలో పదికిపైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకుంటూ నిందితుల జాడ‌ను క‌నిపెట్టారు. ప్రత్యేక పోలీస్‌ బృందాలు దేశంలో వివిధ ప్రాంతాల్లో నిఘా పెట్టి నిందితుల కదలికలపై ఎప్పటికప్పుడు సమచారాన్ని సేకరించాయి. ముగ్గురు నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేసి వారి నుంచి చోరీ సోత్తున స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ చోరీని అతి స్వల్పకాలంలో చేధించడంతో పాటు చోరీ సోత్తును స్వాధీనం చేసుకోవడం ప్రతిభ కనబరిచిన వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, ఏసీపీలు నర్సయ్య, భోజరాజు, కిరణ్‌కుమార్‌, ఆత్మకూర్‌ ,రఘునాథ్‌పల్లి, సిసిఎస్‌, వర్థన్నపేట, పాలకుర్తి, నర్మెట్ట, టాస్క్‌ఫోర్స్‌, పోలీస్‌ కంట్రోల్‌ రూంకు చెందిన ఇన్స్‌స్పెక్టర్లు సంతోష్‌, శ్రీనివాసరెడ్డి,బాలాజీ వరప్రసాద్‌, శివకుమార్‌,రఘుపతి రెడ్డి, శ్రీనివాస్‌రావు,మహెందర్‌ రెడ్డి, అబ్బయ్య, పవన్‌కుమార్‌, విశ్వేశ్వర్‌, ఏఏఓ సల్మాన్‌పాషాతో పాటు ఎస్‌.ఐలు, ఇతర దర్యాప్తు పోలీస్‌ సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed