వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలి

by Aamani |
వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలి
X

దిశ,కార్వాన్ : గుండెపోటు వచ్చిందని ఆసుపత్రికి వెళితే, వైద్యుల నిర్లక్ష్యంతో ఓ ప్రాణం పోయింది. ఈ సంఘటనతో ఆస్పత్రి ముందు బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే... బాధితులు, సీఐ రఘు కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... కార్వాన్ భాంజవాడి ప్రాంతానికి చెందిన ఎల్లయ్య (46) ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తాడు. కాగా మంగళవారం ఉదయం ఆయాసంగా ఉందని లంగర్ హౌస్ హై కేర్ హాస్పిటల్ కి చెకప్ కోసం వచ్చాడు. వెంటనే ఆసుపత్రి వైద్యులు చికిత్సలు ప్రారంభించి, ఈసీజీ చేశారు. అనంతరం ఎలాంటి ప్రమాదం లేదని 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో పెట్టాలని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు.

కాసేపు గడిచాక వ్యక్తి ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. తమ వద్ద కార్డియో స్పెషలిస్ట్ లేదని వెంటనే ఇక్కడ నుంచి తీసుకొని పోవాలని బంధువులను వైద్యులు సూచించినట్లు పేర్కొన్నారు. అంతలోనే సదరు వ్యక్తి మృతి చెందడంతో హాస్పిటల్ ఎదుట పెద్ద ఎత్తున మృతుడి బంధువులు చేరుకొని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని, అంతే కాకుండా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు ఇవ్వడంతోనే చనిపోయాడని మృతుడి బంధువులు ఆరోపించారు. అయితే ఎలాంటి గొడవ కాకుండా పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed