రోడ్డు ప్రమాదంలో రైతు మృతి..

by Disha Web Desk 20 |
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి..
X

దిశ, భిక్కనూరు : గుర్తు తెలియని వాహనం ఢీకొని రైతు దుర్మరం పాలైన సంఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం జరిగింది. పూర్తివివరాల్లోకెళితే మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన బొల్లారపు లింగారెడ్డి (46) పని నిమిత్తం కామారెడ్డి పట్టణానికి వెళ్ళాడు. అక్కడ పనులు ముగించుకొని ద్విచక్ర వాహనం పై తిరిగి వస్తుండగా 44వ జాతీయ రహదారి పై ఆర్టీఏ చెక్ పోస్ట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో లింగారెడ్డి కుడి కన్ను భాగంతో పాటు, తలకు బలమైన గాయాలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న లింగారెడ్డిని 108 అంబులెన్స్ లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకెళ్తూ, వాహనంలోనే మెడికల్ టెక్నీషియన్ రాజేందర్ చికిత్స అందిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఉపాధి అవకాశాలకోసం కొన్ని సంవత్సరాల పాటు గల్ఫ్ దేశానికి వెళ్లిన ఆయన, ఈ మధ్యనే గ్రామానికి చేరుకొని, తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి భార్య వినోద, కుమారుడు భాస్కర్, కుమార్తె అఖిలలు ఉన్నారు. ఈ మేరకు భిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని మార్చూరీకి తరలించారు.



Next Story