ఈసారి లక్షమందికి లాసొచ్చింది!

by  |
ఈసారి లక్షమందికి లాసొచ్చింది!
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: గణపతి పండుగ అంటేనే యువతలో ఏదో తెలియని ఉత్సాహం వచ్చేది. యువత నెల రోజుల ముందు నుంచే యువత ప్లాన్ చేసుకునే వారు. చందాల వసూలు, గణపతి మండపాలు, పూజలు, ఏర్పాట్లు, ముఖ్య అతిథుల ఆహ్వానం వంటి పనులతో బిజీగా ఉండేవారు. ఇదంతా గతం కాని ఈసారి మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారాయి. కరోనా పుణ్యమా అని సీన్ మొత్తం రివర్స్ అయింది.

బోసిపోయిన విక్రయ కేంద్రాలు

జిల్లాలో ప్రతి సంవత్సరం వినాయక చవితి వస్తుందటేనే రాజస్థాన్, యూపీ, బీహార్ తదితర ప్రాంతాల నుంచి విగ్రహాల తయారీదారులు వాలిపోయేవారు. రెండు మూడు నెలల ముందు నుంచే విగ్రహాల తయారీలో వారు నిమగ్నమయేవారు. అలాగే వినాయకులను ఏర్పాటు చేసే వారు కూడా తమ అభిరుచులకు అనుగుణంగా విగ్రహాలను తయారు చేయాలని వారికి ముందుగానే ఆర్డర్లు ఇచ్చేవారు. పండుగ వారం వుండగానే ఈ తయారీ కేంద్రాల వద్ద కొనుగోలుదారుల కోలాహలం మొదలయేది. కానీ కరోనా కారణంగా ఈసారి తయారీదారు వ్యాపారం కూడా పూర్తిగా కుదేలయింది. పోటీపడి పెద్దపెద్ద విగ్రహాలను తయారు చేసే తయారీ దారులు ఈసారి 5ఫీట్లకు మించి తహరు చేయలేదు.

అమ్మకాలు అంతంతే

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతి సంవత్సరం అన్ని ముఖ్య పట్టణాల్లో పదుల సంఖ్యలో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. కానీ ఈ సారి పరిస్థితి మొదటి నుంచి అంతా అనుకూలంగా లేదు. ప్రతి ఏడాది ఏప్రిల్, మే మాసంలో వీరు పట్టణాలకు చేరుకుని తయారీ కార్యక్రామాలు ప్రారంభించేవారు. అయితే ఈ సారి కరోనా లాక్ డౌన్ కారణంగా చాలామంది తయారీదారులు జిల్లాకు రాలేకపోయారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఉన్న వారు కూడా తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఉన్న కొంతమంది కూడా కొంతవరకే విగ్రహాలను తయారు చేసినా ప్రభుత్వం అనుమతులు నిరాకరించిన నేపథ్యంలో వాటిని కూడా కొనే వారు కరువయ్యారు.

రవాణా వ్యవస్థకు దెబ్బ..

వినాయక చవితి సందర్భంగా విగ్రహాల తరలింపునకు వాహనాలను వాడటం సహజం. కానీ ఈసారి ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరించడంతో రవాణా వ్యవస్థ పై ప్రభావం భారీగానే పడిందని చెప్పాలి. ముఖ్యంగా విగ్రహాల తరలింపు నుండి నిమజ్జనం వరకు ట్రాక్టర్లు, లారీలు, డీసీఎంలు, ఆటోలు ఇలా వివిధ రకాల వాహనాలను వాడుతుంటారు. కానీ ఈసారి అడిగే వారే కరువయ్యారు. ప్రతి సంవత్సరం సుమారు పదిహేను రోజుల పాటు పని ఉండే వీరికి ఈసారి ఒక్కరోజు కూడా పని లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా దీని ప్రభావం సుమారు లక్షమందిపై పడిందనే చెప్పాలి. పూల కోసం ఎవరూ రావడం లేదు

తిరుపతి : పూల వ్యాపారి

ప్రతి ఏడాది వినాయక చవితి వచ్చిందంటే పది రోజుల పాటు మాకు పని ఉండేది. పూల దండల తయారీకి సమయం ఉండేది కాదు. గజమాలలు ఎక్కువగా విక్రయాలు జరిగేవి. మండపాల అలంకరణ, రోజువారీ పూజల కోసం పూల విక్రయాలు బాగా జరిగేవి. 4 నుంచి 5లక్షల వరకు వ్యాపారం నడిచేది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు.
ఒక్క విగ్రహం కూడా తీసుకెళ్లలేదు

బోజ : ట్రాక్టర్ యజమాని

ప్రతి ఏడాది కనీసం 15 విగ్రహాలను వివిధ ప్రాంతాలకు తరలించేవాళ్లం. నిమజ్జనం సమయంలో కూడా కనీసం మూడు విగ్రహాలను నిమజ్జనానికి తరలించేవాళ్లం. కానీ ఈ సారి ఒకటంటే ఒక్క విగ్రహం కూడా ఇంత వరకు తీసుకువెళ్లలేదు. విగ్రహాల సైజు, దూరం ఆధారంగా కిరాయి తీసుకునేవాళ్లం. ఈ ఏడాది రూ.20 నుంచి 30 నష్టం పోవాల్సి వచ్చింది.

కరోనాతో వ్యాపారం జరగలేదు : పూజ సామగ్రి విక్రయదారుడు

వినాయక చవితి వచ్చిందంటే మా కుటుంబం సభ్యులు అందరం షాపులో సుమారు వారం ముందు నుంచే ఏర్పాట్లు చేసే వాళ్లం. ముందు నుంచే వారికి కావాల్సిన అన్ని రకాల పూజ సామగ్రిని పొట్లాలు కట్టి సిద్ధం చేసి పెట్టె వాళ్లం. కానీ ఈ సారి అలాంటి ఏర్పాట్లు ఏమీ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. కరోనా వల్ల మా వ్యాపారం బాగా దెబ్బతింది.

Next Story