శభాష్ అన్వితారెడ్డి.. ప్రశంసించిన కలెక్టర్ పమేలా సత్పతి

by  |
Anvitha reddy
X

దిశ, యాదాద్రి భువనగిరి కలెక్టరేట్: యాదాద్రి జిల్లాలో మహిళా పర్వతారోహకురాలు ఉండటం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. భువనగిరికి చెందిన పడమటి అన్వితారెడ్డి గడ్డకట్టే చలిలోనూ మౌంట్ ఎల్ బ్రస్ పర్వతం ఎక్కిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి క్యాంప్ కార్యాలయంలో అన్వితారెడ్డిని ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో భూపాల్ రెడ్డి, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ధనంజనేయులు, సురేందర్, సిలివేరు సైదులు, జి.మురళి పాల్గొన్నారు.

కాగా, రష్యాలో ఉండే మౌంట్ ఎల్ బ్రస్ పర్వతాన్ని అన్వితారెడ్డి మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో గంటకు 64 కిమీ వేగంతో వీచే ఈదురు గాలుల నడుమ 16,500 అడుగులు ఎత్తైన పర్వతాన్ని అధిరోహించారు. అన్వితారెడ్డి చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి గూడూరు నారాయణ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, చెన్న మహేష్ ఆర్థికసాయం చేశారు. కాగా, అన్వితారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. భువనగిరి మండలంలోని ఎరంబెల్లి గ్రామానికి చెందిన పడమటి మధుసూదన్ రెడ్డి, చంద్రకళ దంపతుల కూతురు అన్వితారెడ్డి. ఈమె ఇప్పటి వరకు ఐదు పర్వతాలను అధిరోహించారు.

అన్వితారెడ్డి అధిరోహించిన పర్వతాలు ఇవే..

2015 సంవత్సరంలో రీనోక్ పర్వతం 4500 మీటర్లు
2019 సంవత్సరంలో బసి రాయ్ పర్వతం 6000 మీటర్లు
2021 సంవత్సరంలో సౌత్ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం 5849 మీటర్లు, మౌంట్ ఖడే పర్వతం 6000 మీటర్లు, మౌంట్ ఎల్ బ్రస్ పర్వతం 16,500 అడుగులు. ఈ ఏడాదిలోనే అన్వితా రెడ్డి మూడు పర్వతాలను అధిరోహించడం గమనార్హం.

Next Story