‘దిశ’ తరహాలో మరో సంచలన బిల్లు

by  |
‘దిశ’ తరహాలో మరో సంచలన బిల్లు
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అవినీతికి పాల్పడలాంటే భయపడేట్లు కేసులు నమోదు చేయాలి. వాటిని త్వరతిగతిన తేల్చాలి. గ్రామ సచివాలయాలతో పాటు కలెక్టర్ కార్యాలయాలూ ఇందుకు మినహాయింపు కాదు. కేసులపై పర్యవేక్షణ చాలా అవసరం. దిశ తరహాలో అవినీతిని అంతం చేసే పటిష్టమైన చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎస్ నీలం సాహ్ని తోపాటు పలువురు అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్ గా దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేట్లుండాలని సూచించారు. ఏళ్ల తరబడి కేసులను సాగదీసే తీరుకు స్వస్తి పలకాలని నిర్దేశించారు. 1902 నంబరుకు వచ్చే అవినీతి ఫిర్యాదులను అవినీతి నిరోధక శాఖకు చెందిన 14400కు బదలాయించాలని కోరారు.

తహసిల్దారు, ఎంపీడీఓ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అవినీతి కేసులు పాతికేళ్ల నుంచి పెండింగులో ఉన్నాయంటే.. ప్రభుత్వం అంత సీరియస్ గా లేదని భావించాలి. ఇక నుంచి ఎక్కడా జాప్యం ఉండడానికి వీల్లేదన్నారు. ఇప్పటిదాకా పై స్థాయిలో 50 శాతం అవినీతికి తావులేకుండా చేశాం. మిగతా 50 శాతం కూడా లేకుండా పటిష్టమైన పర్యవేక్షణతో పనిచేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.

14400 కాల్ సెంటర్కు సంబంధించి ఇప్పటిదాకా 44,999 కేసులు వచ్చినట్టు ఏసీబీ అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అందులో అవినీతికి సంబంధించినవి 1747 కేసులున్నట్లు పేర్కొన్నారు. 1712 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. 161 కాల్స్ విషయంలో చర్యలు తీసుకుంటున్నట్లు సీఎంకు నివేదించారు. 35 కాల్స్ పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ గ్రామ సచివాలయాల నుంచి వచ్చే కాల్స్ను కూడా స్వీకరించాలన్నారు. 14400 నంబరుపై మరింత ప్రచారం చేయాలని సూచించారు.

అవినీతి నిరోధానికి సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గుడ్గవర్నెన్స్పై అహ్మదాబాద్ ఐఐఎం నివేదికను ప్రొఫెసర్ సుందర్వెల్లి నారాయణ స్వామి సీఎంకు సమర్పించారు. నివేదిక ప్రకారం అవినీతికి ఆస్కారమున్న ప్రతి శాఖలోనూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై సమీక్ష..

కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్ ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు విషయంలో గత ప్రభుత్వానికీ, ఈ ప్రభుత్వానికి తేడా తెలుస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. రెండేళ్ల క్రితం విద్యుత్ ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం ఎకరా రూ.2.5 లక్షల ప్రకారం లీజు ఒప్పందంపై 4,766.28 ఎకరాలిచ్చింది. మన ప్రభుత్వం సంప్రదింపుల తర్వాత అదే కంపెనీ ఎకరానికి రూ.5 లక్షలు చెల్లిస్తోంది. రెండున్నర లక్షల ఆదాయం పెరిగినట్లు సీఎం జగన్ వెల్లడించారు. దీనివల్ల అదనంగా రూ.119 కోట్ల ఆదాయం వస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే సోలార్/విండ్ ద్వారా ఉత్పత్తి చేసే 1550 మెగావాట్ల ఉత్పత్తికి గాను మెగావాట్కు రూ. లక్ష చెల్లించేట్లు ఒప్పందం చేసుకున్నాం. దీనివల్ల ఏడాదికి రూ.15.5 కోట్ల చొప్పున 28 ఏళ్లలో రూ.322 కోట్లు ఆదా అవుతున్నట్లు సీఎం చెప్పారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఉత్పత్తి చేయనున్న విద్యుత్1680 మెగావాట్ల కరెంటుకు గాను మొదటి పాతికేళ్లలో మెగావాట్ కు ఏడాదికి రూ.లక్ష చొప్పున రూ.16.8 కోట్లు, 25 ఏళ్ల తర్వాత ఏటా రూ.2 లక్షల చొప్పున ఏడాదికి రూ.33.6 కోట్ల మేర ప్రభుత్వానికి మిగులుతుందని సీఎం తెలియజేశారు. దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా రూ.2,940 కోట్లు ఆదాయం వస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వం వచ్చాక ఇదే కంపెనీతో సంప్రదింపులు జరిపాక రూ. 3,381 కోట్ల ఆదాయం వస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు దోహదపడిన అధికారులను సీఎం అభినందించారు. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలోనూ గత ప్రభుత్వం 2,703 ఎకరాల్లో నిర్మిస్తామని ఒప్పందం చేసుకున్న కంపెనీతో అవే వసతులతో 2,203 ఎకరాల్లో నిర్మించేట్లు చేశాం. తద్వారా ఎకరానికి రూ.3 కోట్లు అంచనా వేసుకున్నా రూ.1500 కోట్లు మిగిలినట్టేనని సీఎం వివరించారు.

788 పనులకు రివర్స్ టెండరింగ్…

గత ప్రభుత్వ హయాంలో 788 పనులకు రివర్స్ టెండరింగ్నిర్వహించడం ద్వారా 15.01 మిగులు సాధించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. సాధారణంగా 7.7 శాతానికి మించి మిగులు ఉండదన్నారు. రూ.కోటి దాటిన ప్రతీ పనికి రివర్స్ టెండర్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. టీటీడీలోనూ ఇదే విధానం కొనసాగించేట్లు ఆదేశాలివ్వాలని అధికారులకు సూచించారు. అలాగే రూ.100 కోట్లు దాటిన టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది నుంచి రూ.14,285 కోట్ల విలువైన 45 ప్రాజెక్టులు ప్రివ్యూకు పంపినట్లు తెలిపారు.

Next Story

Most Viewed