కరోనా ఆస్పత్రులకు రేటింగ్ : సీఎం జగన్

by  |
కరోనా ఆస్పత్రులకు రేటింగ్ : సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, వైద్యం కోసం ఆస్పత్రిలో చేరిన వారికి మంచి వైద్యం అందించాలని.. అలా చేసే ఆస్పత్రులకు రేటింగ్ ఇవ్వాలని సీఎం జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా ఆస్పత్రుల సేవలకనుగుణంగా రేటింగ్ ఉండాలని చెప్పారు. ఎప్పటికప్పుడు లోపాలను సరిదిద్దుకుంటూ, సిబ్బంది కొరతను వెంటనే నివారించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కొవిడ్‌ ఆస్పత్రుల సంఖ్యను 138 నుంచి 287కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్పత్రుల్లో స్సెషలిస్టులను, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలన్నారు. కొవిడ్‌ కార్యక్రమాల్లో తాత్కాలికంగా నియమిస్తున్న పారిశుధ్య సిబ్బందికి వేతనాలు పెంచాలని సీఎం జగన్ స్పష్టంచేశారు.

రాష్ట్రంలోని మొత్తం 287 కరోనా ఆస్పత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు, సరైన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది ఉండాలన్నారు. కొవిడ్‌ కాల్‌ సెంటర్‌లు సమర్థవంతంగా పనిచేయాలని.. ఆస్పత్రుల్లోని హెల్ప్‌ డెస్క్‌లు కూడా అందుబాటులో ఉండాలని సూచించారు. అదేవిధంగా హోంక్వారంటైన్‌లో ఉన్నవారికి సేవలు సక్రమంగా అందాలని.. మందులు ఇవ్వడం, సరైన చికిత్స , బాధితుల సందేహాల నివృత్తి ఎప్పటికప్పుడు జరగాలన్నారు.

ఇదిలాఉండగా, ఆరోగ్యశ్రీ కింద వచ్చే రోగులకు అత్యుత్తమ సేవలు అందాలని.. రిఫరల్‌ ప్రోటోకాల్‌ చాలా స్పష్టంగా ఉండాలని తేల్చిచెప్పారు.పేషెంట్‌ను ట్రీట్‌ చేయకుండా, అవసరం లేకుండా రిఫర్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్య ఆసరా పనితీరును కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, డెలివరీ అయిన వెంటనే తల్లికి డబ్బు పంపిణీ అయ్యేలా కార్యక్రమాన్ని పరిశీలించాలన్నారు. తల్లీ బిడ్డ క్షేమంగా డిశ్చార్జి అవుతున్నప్పుడే డబ్బులు వారి ఖాతాల్లో జమకావాలిని అధికారులను కోరారు.



Next Story