విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ కార్యకలాపాలు.. కేంద్రం కీలక ప్రకటన

by srinivas |   ( Updated:2021-12-10 04:46:12.0  )
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ కార్యకలాపాలు.. కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా.. కార్యకలాపాలను ప్రారంభించడంలో జరుగుతున్న జాప్యాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే విశాఖ రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని వారు మీడియాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసేలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధితో కృషిని కొనసాగిస్తుందని విజయసాయి రెడ్డి, మిథున్‌‌రెడ్డి పేర్కొన్నారు.

Next Story

Most Viewed