మరో 2-3 నెలలో స్పెక్ట్రమ్ వేలం: డీఓటీ కార్యదర్శి

by Dishanational1 |
మరో 2-3 నెలలో స్పెక్ట్రమ్ వేలం: డీఓటీ కార్యదర్శి
X

దిశ, బిజినెస్ బ్యూరో: రాబోయే రెండు-మూడు నెలల్లో స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నట్టు టెలికాం విభాగం(డీఓటీ) కారదర్శి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ వేలం ప్రధానంగా టెలికాం కంపెనీలు ప్రస్తుతం నిర్వహిస్తున్న వాటి గడువు ముగుస్తున్న కారణంగా కొనుగోలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. క్రితం వేలంలో భారీగా కొనుగోలు చేసినప్పటికీ, ఏడాది కాలంలో స్పెక్ట్రమ్ కోసం టెలికాం కంపెనీలు పెద్దగా ఖర్చు చేయలేదని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కార్యక్రమంలో కారదర్శి నీరజ్ మిట్టల్ వెల్లడించారు. తగినంత స్పెక్ట్రమ్ అందుబాటులో ఉంది, కంపెనీలు ఎంతైనా ఖర్చు చేసి కొనే అవకాశం ఉంది. అయితే, చాలావరకు గడువు ముగియనున్న స్పెక్ట్రమ్‌ కోసం టాప్-అప్ కొనేందుకు కంపెనీలు ఆసక్తి చూపించవచ్చు. రాబోయే వేలంలో 800మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్ట్జ్, 1800మెగాహెర్ట్జ్, 2100మెగాహెర్ట్జ్, 2300మెగాహెర్ట్జ్, 2500మెగాహెర్ట్జ్, 3300మెగాహెర్ట్జ్, 26గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ విక్రయం జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. టెలికాం కంపెనీలు తమ 5జీ అవసరాలకు ఎక్కువ ఎయిర్‌వేవ్‌లు అవసరం లేనందున ఈసారి స్పెక్ట్రమ్ వేలానికి స్పందన పెద్దగా ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కొన్ని సర్కిళ్లలో తమ లైసెన్స్‌లను రెన్యూవల్ చేయాల్సి ఉన్నందున ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు కొనుగోలు చేయవచ్చు. అలాగే, అదానీ గ్రూప్ తక్కువ స్పెక్ట్రమ్ బ్యాండ్‌లలో కొన్ని ఎయిర్‌వేవ్‌లను కొనే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.


Next Story

Most Viewed