తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by Dishanational1 |
తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన ట్రేడింగ్ రోజంతా లాభనష్టాల మధ్య కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడంతో పాటు దేశీయంగా కీలక సెన్సెక్స్, నిఫ్టీల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల(ఎఫ్అండ్ఓ) నెలవారీ గడువు ముగింపు కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. మిడ్-సెషన్ సమయం నుంచి స్థిరంగా కదలాడిన ర్యాలీ ఆఖరులో కీలక రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దిగ్గజ షేర్లలో కొనుగోళ్ల జోరు మార్కెట్లను నష్టాల నుంచి లాభాలకు తీసుకెళ్లాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 195.42 పాయింట్లు లాభపడి 72,500 వద్ద, నిఫ్టీ 31.65 పాయింట్ల లాభంతో 21,982 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్ రంగాలు రాణించాయి. ఐటీ, మీడియా, హెల్త్‌కేర్ రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, నెస్లె ఇండియా, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్, మారుతీ సుజుకి, టైటాన్, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 1 శాతానికి పైగా లాభాలను సాధించాయి. టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.91 వద్ద ఉంది.


Next Story