వారాంతం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
వారాంతం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం మెరుగైన లాభాలతో ముగిశాయి. కీలక సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ కీలక రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌శీ బ్యాంక్ షేర్లలో ర్యాలీ కలిసొచ్చింది. ఎన్నికల ఫలితాల ర్యాలీ కొనసాగుతున్న తరుణంలోనే కొత్త ప్రభుత్వం మూలధన వ్యయాలను కొనసాగిస్తుందనే ఆశతో ప్రభుత్వ రంగ సంస్థలు, ఇంధన షేర్లలో మదుపర్లు కొనుగోళ్లను పెంచారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 181.87 పాయింట్లు లాభపడి 76,992 వద్ద, నిఫ్టీ 66.70 పాయింట్ల లాభంతో 23,465 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఆటో, మెటల్, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, టాటా మోటార్స్, ఆల్ట్రా సిమెంట్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, కోటక్ బ్యాంక్, ఎల్అండ్‌టీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.54 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed