వరుస నాలుగో రోజు లాభపడ్డ సూచీలు

by Dishanational1 |
వరుస నాలుగో రోజు లాభపడ్డ సూచీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం వరుసగా నాలుగో రోజు పుంజుకున్నాయి. ప్రధానంగా ఫైనాన్స్, మెటల్ రంగాల్లో మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం, తయారీ, సేవల రంగాల డేటా సానుకూలంగా ఉండటం వంటి పరిణామాలు మార్కెట్ల సెంటిమెంట్‌ను పెంచాయి. త్రైమాసిక ఫలితాలపై పెట్టుబడిదారులు దృష్టి సారించడం, కీలక ఐటీ కంపెనీల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆఖర్లో లాభాలు నెమ్మదించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 114.49 పాయింట్లు లాభపడి 73,852 వద్ద, నిఫ్టీ 34.40 పాయింట్ల క్షీణతతో 22,402 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్ రంగం ఏకంగా 2.69 శాతం పుంజుకోగా, ఐటీ, ఫైనాన్స్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, కోటక్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఆల్ట్రా సిమెంట్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.31 వద్ద ఉంది.



Next Story

Most Viewed