వరుస లాభాలకు బ్రేక్

by Dishanational1 |
వరుస లాభాలకు బ్రేక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్ల లాభాలకు బ్రేక్ పడింది. వరుసగా మూడు సెషన్ల పాటు రికార్డు గరిష్ఠాలతో ర్యాలీ చేసిన సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో లాభాల స్వీకరణ కారణంగా నెమ్మదించాయి. ప్రధానంగా అధిక స్థాయిల వద్ద మదుపర్లు లాభాలను వెనక్కి తీసుకోవడం వల్లే నష్టాలు నమోదయ్యాయి. దీనికితోడు అమెరికాలో కీలక వడ్డీ రేట్ల తగ్గింపునకు మరింత సమయం పడుతుందనే సంకేతాలు గ్లోబల్ మార్కెట్లను, దేశీయ ఐటీ రంగ షేర్లను ప్రభావితం చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారత ఈక్విటీల నుంచి నిధులను వెనక్కి తీసుకోవడంతో నష్టాలు ఎదురయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 110.64 పాయింట్లు కోల్పోయి 73,903 వద్ద, నిఫ్టీ 8.70 పాయింట్ల నష్టంతో 22,453 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, మెటల్, ఆటో, రియల్టీ రంగాలు రాణించగా, ఐటీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాలు దిగజారాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, నెస్లె ఇండియా, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. కోటక్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్అండ్‌టీ కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.41 వద్ద ఉంది.

Next Story

Most Viewed