తక్కువ లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు

by Dishanational1 |
తక్కువ లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: రికార్డు కొత్త గరిష్ఠాలకు చేరిన తర్వాత దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో తక్కువ లాభాలతో సరిపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఉదయం లాభాలతో మొదలైన ర్యాలీ ఆ తర్వాత గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అమెరికా మార్కెట్లు, విదేశీ మదుపర్లు భారత ఈక్విటీల్లో నిధులు పెట్టడం, దేశీయంగా ఊహించిన దానికంటే వేగంగా ఆర్థికవ్యవస్థ వృద్ధి మెటల్, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్‌లో ఉత్సాహం పెంచాయి. ముఖ్యంగా దిగ్గజ కంపెనీల షేర్లలో కొనుగోళ్ల కారణంగా మిడ్-సెషన్ సమయంలో అధిక లాభాల వద్దే కదలాడిన సూచీలు ఆఖరు గంటలో అమ్మకాల ఒత్తిడి కారణంగా లాభాలు తగ్గిపోయాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 33.40 పాయింట్లు లాభపడి 74,119 వద్ద, నిఫ్టీ 19.50 పాయింట్లు పెరిగి 22,493 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, మెటల్ రంగాలు గణనీయంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్, ఐటీసీ, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు 1 శాతానికి పైగా పుంజుకున్నాయి. ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకి, టైటాన్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.68 వద్ద ఉంది.


Next Story

Most Viewed