65 శాతం పెరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు!

by Disha Web Desk 13 |
65 శాతం పెరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు గణనీయంగా పెరిగాయి. సమీక్షించిన కాలంలో పీఎస్‌బీల లాభాలు ఏకంగా 65 శాతం పుంజుకుని రూ. 29,175 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి రూ. 17,729 కోట్లు లాభాలను చూశాయి. అన్నిట్లోకి పూణె కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభాలు అత్యధికంగా 139 శాతం వృద్ధితో రూ. 775 కోట్లుగా నమోదయ్యాయి. దీని తర్వాత కోల్‌కతాకు చెందిన యూకో బ్యాంకు 110 శాతం లాభాల పెరుగుదలతో రూ. 653 కోట్లుగా ఉంది.

అలాగే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకులు తమ లాభాలను 100 శాతం కంటే ఎక్కువగా సాధించాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 107 శాతం వృద్ధితో రూ. 2,245 కోట్లు, ఇండియన్ బ్యాంక్ 102 శాతం వృద్ధితో రూ. 1,936 కోట్లుగా నమోదు చేశాయి. అదేవిధంగా 2022-23లో మొదటి తొమ్మిది నెలకు సంబంధించి పీఎస్‌బీలు రూ. 48,893 కోట్ల నుంచి రూ. 70,166 కోట్లకు పెరిగాయి. ఇది 43 శాతం వృద్ధి. మొదటి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో రూ. 15,306 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ. 25,685 కోట్లు, మూడో త్రైమాసికంలో రూ. 29,175 కోట్లుగా నమోదయ్యాయి. నిరర్ధక ఆస్తులకు సంబంధించి ఎస్‌బీఐ నికరంగా 0.77 శాతం, బీఓఎం 0.47 శాతంతో అతి తక్కువగా ఉన్నాయి.


Next Story