ఈవీలకు ఇచ్చే సబ్సిడీని పొడిగించాలని పార్లమెంటరీ కమిటీ సూచన

by Disha Web Desk 17 |
ఈవీలకు ఇచ్చే సబ్సిడీని పొడిగించాలని పార్లమెంటరీ కమిటీ సూచన
X

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి, ప్రజలకు వీటి పట్ల అవగాహన కల్పించడానికి ఫేమ్ ఇండియా పథకం కింద ప్రయోజనాలను మరో రెండేళ్లు పొడిగించాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. పార్లమెంటరీ ప్యానెల్ లోక్‌సభలో ఈవీల గురించి సమర్పించిన నివేదికలో ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఫేమ్ ఇండియా పథకం ద్వారా ఈవీలను ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని తొలగించడం వల్ల మార్కెట్లో ఈ రంగంలో భారీ మార్పులు వస్తాయి. ఈవీల ధరలు భారీగా పెరుగుతాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో స్టార్టప్‌లు కూడా దీనిలో పాలుపంచుకున్నాయి. ఈ పథకాన్ని ఆపివేయడం వల్ల స్టార్టప్‌లు, వివిధ ఈవీ పరిశ్రమలు భారీ ఎత్తున నష్టపోతాయి. కాబట్టి ఫేమ్-2 పథకాన్ని మార్చి 31, 2024 తర్వాత అదనంగా రెండేళ్లపాటు పొడిగించాలని కమిటీ తన నివేదికలో తెలిపింది.

కమిటీ నివేదిక ప్రకారం, ఫేమ్-3 ని ప్రవేశపెట్టి బ్యాటరీ వేస్ట్ మేనేజ్‌మెంట్/రీసైక్లింగ్, గ్రీన్ మొబిలిటీ లక్ష్యాలను ప్రజలకు చేరవేయాలని సూచించింది. తక్కువ వడ్డీ, తక్కువ జీఎస్‌టీ వంటి ప్రోత్సహకాల ద్వారా హైబ్రిడ్ , హైడ్రోజన్ ఇంధన సెల్ వాహనాలు వంటి ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రచారం చేయాలని తెలిపింది. సోలార్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు గురించి కూడా ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని పేర్కొంది.


Next Story