భారత్‌లో 3 కోట్ల కార్లను ఉత్పత్తి చేసిన మారుతీ సుజుకి

by Dishanational1 |
భారత్‌లో 3 కోట్ల కార్లను ఉత్పత్తి చేసిన మారుతీ సుజుకి
X

దిశ, బిజినెస్ బ్యూరో: జపాన్‌కు చెందిన సుజుకి మొటార్ కార్పొరేషన్ అరుదైన ఘనతను సాధించింది. భారత మార్కెట్లో 3 కోట్ల వాహనాల ఉత్పత్తిని అధిగమించిన రెండో దేశంగా నిలిచినట్టు బుధవారం ప్రకటనలో వెల్లడించింది. స్వదేశం జపాన్‌లో కంటే వేగంగా ఈ మైలురాయిని భారత్‌లో చేరుకున్నామని కంపెనీ తెలిపింది. కంపెనీ అనుబంధ మారుతీ సుజుకి ఇండియా 2024, మార్చి చివరి నాటికి దేశంలో 3 కోట్ల యూనిట్ల ఉత్పత్తిని చేరుకుందని సుజుకి మోటార్స్ పేర్కొంది. 'జపాన్ తర్వాత ఈ మైలురాయి చేరుకున్న రెండో దేశంగా భారత్ నిలిచింది. 1983, డిసెంబర్‌లో ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుంచి కేవలం 40 సంవత్సరాల 4 నెలల్లోనే 3 కోట్ల యూనిట్ల ఉత్పత్తికి చేరుకున్నాం. జపాన్‌లో ఈ మార్కు చేరేందుకు 55 సంవత్సరాల 2 నెలల సమయం పట్టిందని, భారత్ విషయంలో రికార్డులు నమోదయ్యాయని' కంపెనీ వివరించింది. భారత్‌లో కంపెనీ ఉత్పత్తి మారుతీ 800 మోడల్‌తో ప్రారంభమైంది. అప్పట్లో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్, భారత ప్రభుత్వంతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది. ప్రస్తుతం మారుతీ సుజుకి గురుగ్రామ్, మనేసర్(హర్యానా), హన్సల్‌పూర్(గుజరాత్)లలో తయారీ ప్లాంటులను నిర్వహిస్తోంది. తాము మేక్ ఇన్ ఇండియా నినాదానికి కట్టుబడి ఉన్నాం. దేశీయ, ప్రపంచ మార్కెట్లకు వాహనాలను అందిస్తూ కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నాం. భారత్ నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో దాదాపు 40 శాతం తమదేనని మారుతీ సుజుకి ఇండియా సీఈఓ హిసాషి టెకుచి పేర్కొన్నారు.

Next Story

Most Viewed