ఒక్కరోజే రూ. వెయ్యికి పైగా పెరిగిన బంగారం

by Dishanational1 |
ఒక్కరోజే రూ. వెయ్యికి పైగా పెరిగిన బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ భారీగా ఏర్పడటంతో గురువారం దేశీయంగా కూడా బంగారం పెరిగిపోయింది. ప్రధానంగా బుధవారం అమెరికా ఫెడ్ మరోసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం, ఈ ఏడాదిలో మూడుసార్లు కోత ఉంటుందని సంకెతాలివ్వడంతో యూఎస్ కరెన్సీ డాలర్ ఇండెక్స్‌లో పెద్ద ఎత్తున అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం గిరాకీ సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరేందుకు కారణమని విశ్లేషకులు తెలిపారు. ఈ ప్రభావంతో భారత్‌లోనూ ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో గురువారం స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాములు రూ. 1,090 పెరిగి రూ. 67,420కి చేరుకోగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 1,000 పెరిగి రూ. 61,800కి చేరాయి. వెండి సైతం కిలో రూ. 1,500 పెరిగి రూ. 81,500 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్సు 2,208 డాలర్ల వద్ద రికార్డు స్థాయికి పెరిగింది. ఔన్స్ వెండి 25.51 డాలర్లుగా ఉంది. మిగిలిన ప్రధాన నగరాల్లో ధరలను గమినిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ. 67,570 ఉండగా, ముంబైలో రూ. 67,420, చెన్నైలో రూ. 68,020, బెంగళూరులో రూ. 67,420 వద్ద ఉన్నాయి.

Next Story

Most Viewed