మూడు నెలల గరిష్ఠ స్థాయికి కీలక రంగాల ఉత్పత్తి..!

by Disha Web Desk 7 |
మూడు నెలల గరిష్ఠ స్థాయికి కీలక రంగాల ఉత్పత్తి..!
X

న్యూఢిల్లీ: దేశంలో కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల ఉత్పత్తి గతేడాది డిసెంబర్‌లో మూడు నెలల గరిష్ఠానికి చేరుకుంది. సమీక్షించిన నెలలో ఎనిమిది మౌలిక రంగాల ఉత్పత్తి 7.4 శాతంగా నమోదవగా, 2021 డిసెంబర్‌లో ఇది 4.1 శాతంగా ఉన్నట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటనలో తెలిపింది. అంతకుముందు నవంబర్ నెలలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 5.7 శాతం పెరిగింది. సమీక్షించిన నెలలో బొగ్గు, ఎరువులు, ఉక్కు, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి పుంజుకున్నాయి. గణంకాల ప్రకారం, గతేడాది డిసెంబర్‌లో ముడి చమురు ఉత్పత్తి 1.2 శాతం క్షీణించింది.

బొగ్గు ఉత్పత్తి 11.5 శాతం, విద్యుదుత్పత్తి 10 శాతం, స్టీల్ 9.2 శాతం, సిమెంట్ 9.1 శాతం, ఎరువులు 7.3 శాతం, పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు 3.7 శాతం, సహజవాయువు 2.6 శాతం పెరిగింది. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 8 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో 12.6 శాతంగా ఉందని గణాంకాలు వెల్లడించాయి. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్‌, విద్యుత్‌ వంటి ఈ ఎనిమిది మౌలిక రంగాలను కీలక రంగాలుగా వ్యవహరిస్తారు. పారిశ్రామికోత్పత్తి సూచీలో ఈ రంగాల వాటా 40.27 శాతంగా ఉంటుంది.


Next Story

Most Viewed