ఈవీ కార్ల తయారీ ప్రాజెక్టును ఆపేసిన యాపిల్

by Dishanational1 |
ఈవీ కార్ల తయారీ ప్రాజెక్టును ఆపేసిన యాపిల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన ఎలక్ట్రిక్ కారు తయారీ ప్రాజెక్టును విరమించుకుంది. దశాబ్దం పాటు ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న కంపెనీ అనూహ్యంగా నిలిపేయడం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంసమైంది. ఈ మేరకు మంగళవారం కంపెనీ అంతర్గత సమావేశంలో ఉద్యోగులకు స్పష్టం చేసిందని సమాచారం. దీని గురించి ఎన్నడూ అధికారికంగా బహిర్గతం చేయని యాపిల్, ప్రాజెక్టును పక్కనపెట్టిన సంగతి సైతం అధికారికంగా చెబుతుందా లేదా అనేది తెలీదు. ఈ ప్రాజెక్టు కోసం పనిచేసిన ఉద్యోగులను యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) విభాగానికి బదిలీ చేయనుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు పెంచిన అధిక వడ్డీ రేట్ల కారణంగా వినియోగదారుల సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీనివల్ల ప్రారంభ దశలో ఉన్న ఈవీ మార్కెట్లో కార్ల ధరలు కొంత ఎక్కువ ఖరీదు కావడంతో డిమాండ్ మందగించింది. దీనివల్ల పరిశ్రమలోనూ ఉద్యోగాల కోత, ఉత్పత్తి తగ్గిపోవడం కనిపిస్తోంది. మరోవైపు, గ్లోబల్ ఈవీ దిగ్గజం టెస్లాతో పాటు ప్రధాన కార్ల తయారీ కంపెనీలు సైతం ఈ విభాగంలో పెట్టుబడులను తగ్గిస్తున్నారు. పూర్తి ఈవీలకు బదులుగా హైబ్రిడ్ కార్లపై దృష్టి సారిస్తున్నారు.2014 నుంచి ఈవీ కారు తయారీపై పనిచేస్తున్న యాపిల్, ఇప్పటివరకు దాని గురించి బహిరంగంగా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే, యాపిల్ ఈవీ మోడల్‌ను రోడ్లపై పరీక్షిస్తున్నట్టు కథనాలు వెలువడ్డాయి. 2024 లేదా 2025 నాటికి విడుదల చేస్తుందని కూడా వార్తలొచ్చాయి. కానీ, ఈ ప్రాజెక్టును ఆపేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


Next Story

Most Viewed