కేసీఆర్ అదిరిపోయే స్కెచ్.. హుజురాబాద్ అభ్యర్థిగా విద్యార్థి నేత.?

by  |
KCr
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ సీఎం కేసీఆర్ అదిరిపోయే స్కెచ్ వేశారు. ఎవరి అంచనాలకు అందకుండా ఎప్పటికప్పుడు ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో బీసీ నాయకునికే టికెట్ కేటాయించాలని సీఎం తుది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

అయితే, ఇప్పటికే హుజురాబాద్ బై పోల్స్ లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. ఇక్కడి ఓటర్లను ప్రభావితం చేసేందుకు సీఎం శతవిధాల ప్రయత్నిస్తున్నారు. నియోజవర్గంలో అన్ని వర్గాల వారిని టీఆర్ఎస్ కు అనుకూలంగా మల్చుకునే ఎత్తగడతో ముందుకు సాగబోతున్నారు.

బీసీ అభ్యర్థే ఫైనల్..

దళిత బంధు స్కీంతో సానుకూలత తీసుకొచ్చుకున్నామని భావిస్తున్న ముఖ్యమంత్రి అగ్రవర్ణాలకు ప్రత్యేక పదవులు కట్టబెట్టే యోచనలో ఉన్నారు. హుజురాబాద్‌లో ఓటర్లను ఆకర్షించగలిగే అగ్రవర్ణ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో దళితులు, అగ్రవర్ణాలు పార్టీ వైపు మొగ్గు చూపుతారని, బీసీ అభ్యర్థిని బరిలో నిలిపి ఆ సామాజిక వర్గాల ఓట్లు టీఆర్ఎస్‌కు పడే విధంగా వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఉప ఎన్నికల్లో బీసీ నాయకునికే టికెట్ కేటాయించాలని సీఎం తుది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

గెల్లుకే అవకాశం..

మరోసారి బీసీని బీసీతోనే చెక్ పెట్టాలని భావిస్తున్న సీఎం.. టీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే గెల్లుకు ఈ మేరకు సంకేతాలు వెళ్లాయని సమాచారం. గెల్లు శ్రీనివాస్‌కు టికెట్ ఇచ్చినట్టయితే ఉద్యమకారునికి అవకాశం ఇవ్వడం, విద్యార్థి విభాగానికి ప్రాధాన్యత కల్పించినట్టు అవుతుందని యోచిస్తున్నారు.

అంతేకాకుండా హుజురాబాద్‌లో యాదవ, కుర్మ సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు కూడా 22 వేల వరకూ ఉండటం వల్ల గెల్లును బరిలో నిలిపితే సక్సెస్ అవుతామని భావిస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే అటు ఉద్యమకారునికి గుర్తింపు ఇచ్చినట్టవుతుందని, ఇటు బీసీ అయిన ఈటలకు పోటీగా బీసీనే నిలబెట్టినట్టవుంతుంది. దీనివల్ల ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

త్వరలోనే ప్రకటన..

హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిని వారం లేదా పది రోజుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే గ్రౌండ్ లెవల్లో వెళ్లి పనిచేసుకోవాలని గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు పార్టీ పెద్దలు సూత్ర ప్రాయంగా చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో, ఆయన కూడా మంగళవారం నుంచి హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించేందుకు కార్యాచరణ సిద్దం చేసుకున్నారు.

gellu-srinivas


Next Story

Most Viewed