కల్తీ ఫుడ్‌పై కంట్రోల్ ఏది?

by Mahesh |
కల్తీ ఫుడ్‌పై కంట్రోల్ ఏది?
X

దిశ, ఏలూరు బ్యూరో: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రధాన నగరాల్లో పట్టణాల్లో రెస్టారెంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పలురకాల మాంసాహార ఐటమ్స్‌తో ఆఫర్లు ఇస్తూ ఆహార ప్రియులను నట్టేట ముంచుతున్నాయి. ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, సహా మిగిలిన పట్టణాల్లో కల్తీ ఆహారం రాజ్యమేలుతోంది. దీంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 20 వేల రెస్టారెంట్లు ఉండగా వీటిలో అనుమతులు ఉన్నవి వెయ్యి లోపలనే ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరులో మొత్తం స్ట్రీట్ ఫుడ్స్ సెంటర్లు, భోజనం, టిఫిన్ హోటల్స్ అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ అనుమతులు మాత్రం పరిమితంగా ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో కూడా సుమారు 200 భోజన హోటల్లు, 250 స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఉండగా వాటిలో కూడా అనుమతులు తక్కువగా ఉన్నాయి.

భీమవరం పరిసర ప్రాంతాల్లో సుమారు 1000కి పైగా మాంసాహార విక్రయ కేంద్రాలు, అలాగే అధిక సంఖ్యలో రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, భోజన హోటల్లు ఉన్నప్పటికీ వాటిలో సగానికి కూడా అనుమతులు లేకపోవడం గమనార్హం. ఏజెన్సీకి జంగారెడ్డిగూడెం ముఖద్వారం కావడంతో చుట్టుపక్కల ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇదే అదునుగా తీసుకుని రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, భోజన హోటల్లు, మితిమీరుతున్నాయి. ఇష్టానుసారంగా నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి ఉమ్మడి జిల్లాల్లో విక్రయిస్తుంటే ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోందని పలు ప్రజా సంఘాల వారు మండిపడుతున్నారు.

ఆహార విక్రయాలకు అనుమతి లేవి..

ప్రస్తుతం మార్కెట్లో ఆహార పదార్థాల బిజినెస్ ఊపందుకుంటుంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు అనుభవం లేని చెఫ్‌లను పెట్టుకొని పలు రెస్టారెంట్లు, హోటల్ వారు ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆహార పదార్థాల విక్రయించే హోటళ్లు, రెస్టారెంట్లు, పలు దుకాణాలకు, ఆహార భద్రత అధికారుల నుంచి పలు అనుమతులు పొందాలి. అయితే ఈ అనుమతులకు విరుద్ధంగా కొందరు ఇష్టారాజ్యంగా ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని సంపాదనే ధ్యేయంగా నాణ్యతలేని పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టి క్యాష్ చేసుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం, ఏలూరు పట్టణాల్లో పలు కర్రీ పాయింట్లు, దాబాలు, రెస్టారెంట్లు, భోజన హోటల్లు, టిఫిన్ హోటళ్లకు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంటే వీటిపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఆహార విక్రయ కేంద్రాలకు నిబంధనలు ఇవే..

ఆహార పదార్థాలు విక్రయించే రెస్టారెంట్లకు, భోజన హోటలకు, దాబాలకు, కర్రీ పాయింట్‌లకు రిజిస్ట్రేషన్ తో పాటు, ఆహార భద్రత అధికారి నుంచి లైసెన్స్ పొందాలి. అధికారులు దాడుల్లో ఆహార విక్రయ కేంద్రాల్లో అనుమతులు లేకపోతే ముందుగా నోటీసులను జారీ చేయాలి. ఆ తర్వాత కూడా అదే తీరు కొనసాగితే ఆ కేంద్రాలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించాలి. అంతేకాకుండా ఏడాదికొకసారి నిర్ణీత సంఖ్యలో నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపించాలి. జిల్లాలోని ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలలో దీనికి భిన్నంగా కొనసాగుతుంటే అధికారులకు మాత్రం ఏమి పట్టడం లేనట్లు వ్యవహరిస్తున్నారు.

ఆహార భద్రత అధికారుల పర్యవేక్షణ కరువు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కల్తీ ఆహారం రాజ్యమేలుతోంది. నిల్వ ఉంచిన ఆహారాలను విక్రయిస్తూ ప్రజారోగ్యంపై దెబ్బతీస్తున్న విక్రయదారులపై అధికారులు చర్యలు శూన్యం అనిపిస్తుంది. కల్తీ ఆహారాలు విక్రయం జరగకుండా తీసుకోవాల్సిన అధికారులే ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటే కల్తీ రాకెట్లు రెచ్చిపోతున్నారు. ఆహార భద్రత అధికారులు ఒక్కొక్కరు వారి పరిధిలో నిర్ణీత సంఖ్యలో ప్రజలు ఉపయోగించే నిత్యవసరాల్లో వాటి నాణ్యత ప్రమాణాలను తెలుసుకునేందుకు నమూనాలను సేకరించాలి. సేకరించిన నమూనాలను ల్యాబ్‌లకు పంపించి వచ్చిన ఫలితాలు ఆధారంగా విక్రయదారులపై చర్యలు తీసుకోవాలి.

అయితే ఈ తీరు ఆచరణలో మాత్రం శూన్యం అనిపిస్తుంది. పర్యవేక్షించాల్సిన అధికారులే పట్టించుకోకుండా ఉంటూ తూతూమంత్రపు దాడులతో మమ అనిపిస్తున్నారు. ప్రతి మండలానికి ఒక ఆహార భద్రత అధికారి ఉండి పర్యవేక్షణ చేయాల్సి ఉండగా ఉమ్మడి జిల్లాలో మాత్రం సిబ్బంది కొరతతో ఆహార భద్రత అధికారులు గగ్గోలు పెడుతున్నారు. రెండు జిల్లాలకు ఇద్దరు అధికారులు ఉండడం, వీరే నమూనాలు సేకరించి చర్యలు తీసుకోవాల్సి ఉండగా పని భారం ఎక్కువ కావడంతో దాడులు నామమాత్రంగా సాగుతున్నాయి.

Next Story

Most Viewed