‘కోడ్ ఉల్లంఘన.. అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలి’

by Rajesh |
‘కోడ్ ఉల్లంఘన.. అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలి’
X

దిశ, ఏపీ బ్యూరో : కోడ్ ఉల్లంఘించిన అధికారులు, అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజి, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీలతో కలిసి అదనపు ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షన్ల పంపిణీ వ్యవహారంపై తప్పుడు ప్రచారాలు, నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎస్ జవహర్ రెడ్డి ఎప్పుడూ జగన్ భజన చేస్తుంటారని, పెన్షన్ పంపిణీ వ్యవహారంపై ప్రభుత్వం ఇంతలా అబాసుపాలు అవ్వడానికి సీఎస్ జవహార్ రెడ్డే కారణమని దుయ్యబట్టారు.

సీఎస్ పై చర్యలు తీసుకోకపోతే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదన్నారు. వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయించవద్దని చంద్రబాబు చెప్పలేదని, ఎన్నికల కమిషన్ చెప్పిందన్నారు. కానీ పేర్ని నాని మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ.. సస్పెండ్ అయిన వాలంటీర్లందరూ రండి అంటూ పింఛనుదారులను తీసుకెళ్లి అల్లరి చేయండని బాహాటంగా మాట్లాడడంపై మండిపడ్డారు. ఇక సీఎం జగన్ మదనపల్లె సభలో స్కూలు విద్యార్థులను కూర్చోబెట్టి ఫ్యాను గుర్తుకు ఓటు వేయండని 11 ఏళ్ల బాలికతో చెప్పించడం బాలల హక్కులకు వ్యతిరేకమన్నారు. అందుకు గానూ ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిలింగ్ పేరుతో ట్రైనింగ్ స్కూలుకు తీసుకెళ్లి రాత్రంతా తమ కార్యకర్తలను కర్నూలు ఎస్పీ రాత్రంతా చిత్రహింసలు పెట్టి కొట్టాడని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారికి ఏ గతి పట్టిందో చూసైనా ఎస్పీ బుద్ధి తెచ్చుకోవాలన్నారు.

ఏకపక్షంగా వ్యవహరిస్తోన్న కర్నూలు ఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అనే దుర్మార్గుడు పెన్షన్‌లను ఆపించాడని ఫన్నీ మినిస్టర్ జోగి రమేష్ దుష్ప్రచారాలు చేస్తున్నారని, ఇలా దుష్ప్రచారాలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని, ఈయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఇక బుద్ధి ఉపయోగించి సలహాలివ్వాల్సిన ప్రభుత్వ సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని, ఈయనపై తుళ్లూరు పోలిస్ స్టేషన్‌లో కేసు నమోదైన ఈయన రాష్ట్ర బాగు కోసం ఎలాంటి సలహాలిస్తారో ఆయనకే తెలియాలని వ్యంగస్ర్తాలు సంధించారు. ఈ సందర్భంగా అదనపు ఎన్నికల అధికారి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.



Next Story

Most Viewed