వారసులకు Jagan నై.. Chandrababu సై

by Disha Web Desk 4 |
వారసులకు Jagan నై.. Chandrababu సై
X

రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో పొలిటికల్ హీట్ మొదలైంది. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార వైసీపీ ఎమ్మెల్యేలు తమ వారసులకు టికెట్ల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నేతల అంచనాలను తలకిందులు చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేయడంతో నేతల్లో కలవరం మొదలైంది. తనయులకు బ్రేక్ వేస్తూ.. తండ్రులకు షాక్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత మాత్రం అందుకు భిన్నంగా వారసులకు 40 శాతం సీట్లు ఇస్తానని తేల్చిచెప్పారు. దీంతో ఎమ్మెల్యేలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వయోభారంతో తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని, తన స్థానంలో కుమారుడు పోటీ చేస్తాడని ప్రకటించారు.

దిశ, కర్నూలు ప్రతినిధి: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాష్ర్టంలో ముందస్తు ఎన్నికల ప్రచార నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రానున్న ఎన్నికల్లో తమకు బదులుగా తమ వారసులను రంగంలోకి దింపే యత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి తమ వారసులపై బహిరంగ ప్రకటన చేశారు. దీనికి సీఎం జగన్ ఘాటుగా స్పందించారు. రాష్ర్టంలో 175కు 175 గెలవాలని, వారసులకు నో ఛాన్స్.. మీరే పోటీ చేయాలని స్పష్టంగా ఆదేశాలిచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు యువతకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలనే నిర్ణయానికి అనుగుణంగా ప్రకటన చేశారు. 40 శాతం సీట్లు యువతకు కేటాయించనున్నట్లు హామీ ఇచ్చారు.

టికెట్ల కోసం వ్యూహాలు...

అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతల భిన్న వైఖరులతో జిల్లా నేతలు ఇప్పటి నుంచే వ్యూహ, ప్రతి వ్యూహల్లో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన 'గడపగడపకు మన ప్రభుత్వం' అనే కార్యక్రమంలో నేతలు తమ వారసులను కూడా భాగస్వాములను చేశారు. జిల్లాలో అధికార, ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. సరైన సమయంలో ముఖ్యమంత్రిని కలిసి టికెట్ల విషయంలో లైన్ క్లియర్ చేసుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. జిల్లాలో మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కుమారుడు ధరణి రెడ్డి, ఎమ్మిగనూరు టికెట్ కోసం బాలనాగిరెడ్డి సోదరుడు సీతారాం రెడ్డి కుమారుడు ప్రదీప్ రెడ్డి, నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు శివ నరసింహారెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి కుమారుడు జయ మనోజ్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు.. ఇలా జిల్లాలో నేతలు తమ వారసుల కోసం యత్నాలు సాగిస్తున్నారు. వీరి ప్రయత్నాలు ఫలిస్తాయా ? లేదా అనే చర్చ జిల్లాలో జోరందుకుంది.

చెన్నకేశవ రెడ్డి బాటలో నలుగురు ?

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వయోభారం కారణంగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని, తన స్థానంలో తనయుడు జగన్ మోహన్ రెడ్డి పోటీ చేస్తారని కీలక ప్రకటన చేశారు. ఈయన ప్రకటన జిల్లాలో చర్చనీయాంశం కాగా అదే బాటలో మరో నలుగురు ఎమ్మెల్యేలున్నట్లు సమాచారం. అందులో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అవకాశం ఇస్తే వారసులను దించేందుకు సిద్ధంగా లోలోపల ప్రయత్నాలు చేస్తుండగా పైకి మాత్రం అధినేత ఎలా చెబితే ఆయన మాటకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. ఈ క్రమంలో తమ వారసులకు సీట్లు ఇవ్వకుంటే వైసీపీ నేతలు జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరుతారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

టీడీపీలో లైన్ క్లియర్

టీడీపీలో వారసులకు లైన్ క్లియర్ చేస్తూ అధినేత చంద్రబాబు ప్రకటన చేశారు. నారా లోకేష్‌ను దృష్టిలో ఉంచుకుని యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో నారా లోకేష్ వెంట తిరుగుతోన్న యువ నాయకులు వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్లు ఇస్తారనే ధీమాలో ఉన్నారు.


Next Story

Most Viewed