విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రాణ త్యాగనికైనా సిద్ధం.. సీపీఐ నాయకులు

by Dishafeatures2 |
విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రాణ త్యాగనికైనా సిద్ధం.. సీపీఐ నాయకులు
X

దిశ, ఆత్మకూరు : విశాఖ ఉక్క ఫ్యాక్టరీ పరిరక్షణకు ప్రాణత్యాగానికైనా సిద్ధమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సుంకయ్య అన్నారు. మంగళవారం ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని, ఆంధ్ర ప్రజల గుండె చప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అని అన్నారు. విద్యార్థులు, ప్రజల బలిదానాలతో రైతుల త్యాగాలతో ప్రజా ప్రతినిధుల రాజీనామాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నేడు అధికారం లోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు.మోడీ కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించే పద్ధతిలో జగన్ ప్రభుత్వం లేకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర పరిధిలో కీలకంగా ఉండి, లాభాల్లో ఉన్న ఇంత పెద్ద భారీ పరిశ్రమను అదానికి సిద్ధమవుతోంటే జగన్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మోడీ, అదానీకి జగన్ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని ఆరోపించారు.గత రెండు సంవత్సరాలుగా విశాఖ ఉక్కు ప్రవేటీకరణ వద్దంటూ కార్మికులు, నిర్వాసితులు, ప్రజా సంఘాలు

పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని చెప్పారు. అందుకే తమ ఆందోళనలను ఉధృతం చేశామని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రజల హక్కులను భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ నెల 30న విశాఖలో లక్ష మందితో కార్మికుల గర్జన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్మిక గర్జనకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు దీక్షలు చేపట్టినట్లు వివరించారు. 25వ తేదీన కలెక్టరేట్ వద్ద దీక్షలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజల ఆస్తులను తెగనమ్మే మోడీ ప్రైవేటీకరణ విధానాలకు, ఆయనకు మద్దతిస్తున్న జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజానీకం సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రఘురాం మూర్తి, కార్యదర్శి ఎం.రమేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి మోట రాముడు, సీపీఐ మండల నాయకులు ప్రసాద్, ప్రతాప్, యేసేపు కొత్తపల్లి నాయకులు వెంకట శివుడు, ఆత్మకూరు ఏఐటీయూసీ కార్యదర్శి అహమద్ హుస్సేన్, చాంద్ బాషా, జూపాడు బంగ్లా సీపీఐ నాయకులు నరసింహ, శ్రీను, మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు.


Next Story