Yuvagalam: బీసీలకు నారా లోకేశ్ కీలక హామీ

by Disha Web Desk 16 |
Yuvagalam: బీసీలకు నారా లోకేశ్ కీలక హామీ
X

దిశ, నెల్లూరు రూరల్: బీసీలకు చెందిన 75 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను దారి మళ్లించిన బీసీల ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం యువనేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. నారా లోకేష్ పాదయాత్ర ఆదివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాకుపల్లి వద్ద ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన వివిధ వర్గాల ప్రజలతో లోకేష్ మమేకమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై 26 వేలకు పైగా కేసులు నమోదు చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఉపాధి అవకాశాలను కూడా దెబ్బ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు వచ్చేవరకు 3 వేల రూపాయలు ఉద్యోగ భృతి అందజేస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయని ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ప్రకటించారు.

లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన కోటంరెడ్డి సోదరులు

నారా లోకేష్ పాదయాత్రకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలతో లోకేష్‌ను సత్కరించారు. 101 మంది మహిళలు నారా లోకేష్‌కు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని రీతిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలెత్తారు.

స్మార్ట్ సిటీగా నెల్లూరు

నారా లోకేష్ పాదయాత్ర హరనాధపురం చేరుకోగానే సిటీ నియోజకవర్గం 19వ డివిజన్ ప్రజలు ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. తమ డివిజన్ నుండి ప్రతి యేటా నెల్లూరు కార్పొరేషన్‌కు రూ.4 కోట్లు పన్నుల రూపంలో చెల్లిస్తున్నామన్నారు. కానీ తమ డివిజన్‌లో మౌలిక సదుపాయాల కోసం కట్టిన పన్నుల్లో 10 శాతం కూడా ఖర్చు చేయడం లేదని వారు లోకేష్‌కు వివరించారు.

నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు అన్నచందంగా పన్నులు పెంచడం తప్ప మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన దాఖలాలు లేవన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని చెప్పారు. నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed