జే టాక్స్ దెబ్బకి రాష్ట్రంలో పరిశ్రమలు పరార్.. అచ్చెన్నాయుడు

by Disha Web Desk 16 |
జే టాక్స్ దెబ్బకి రాష్ట్రంలో పరిశ్రమలు పరార్..  అచ్చెన్నాయుడు
X

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడేళ్ల పాలనలో పరిశ్రమలకు శ్రమలు వచ్చిపడ్డాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా జే ట్యాక్స్ దెబ్బకు ఉన్న పరిశ్రమలు పారిపోయాయి. రిలయన్స్, లులు, ఫ్రాంక్లిన్ అండ్ టెంపుల్టన్ వంటి అనేక సంస్థలు వెనక్కి వెళ్లిపోయిన విషయాన్ని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా కంపెనీ పెట్టాలంటే పేపర్లు తీసుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్లడం కంటే ముందే కమీషన్లు తీసుకుని తాడేపల్లి ప్యాలెస్‌కి వెళ్లాలి. ఓ వైపు పెరిగిన ట్యాక్స్‌లు, మరోవైపు జే టాక్స్‌తో ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు.

మూడేళ్లలో జగన్ విదేశాల నుంచి తెచ్చిన పెట్టుబడుల కంటే.. తన విదేశీ పర్యటనలకు చేసిన ఖర్చే ఎక్కువ. టీడీపీ హయాంలో ఒప్పందాలు కుదిరిన పరిశ్రమలకు జగన్ రెడ్డి శంకుస్ధాపనలు చేసి అది తన ఘనతగా ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటు. ఏటీసీ టైర్ల పరిశ్రమ ప్రతినిధులతో చర్చలు జరిపింది, విశాఖకు ఆ కంపెనీని తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమే. 2019 ఎన్నికల సమయంలో ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమయింది. దీన్ని జగన్ రెడ్డి తానే తెచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారు. చిత్తూరు జిల్లా చినపాండూరు లో 2018లో అపోలో టైర్స్ రూ. 1800 కోట్లతో ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి తీసుకొచ్చాం. అది 2020జూన్ 26న ఉత్పత్తి మొదలు పెట్టింది. కానీ జగన్ రెడ్డి మాత్రం అది కూడా తానే తెచ్చినట్టు ప్రచారం చేసుకున్నారు. పరిశ్రమలపై క్రెడిబులిటీ చంద్రబాబుదయితే పబ్లిసిటీ జగన్ రెడ్డిదని ప్రజలు అంటున్నారు' అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.

తిరోగమనంలో పారిశ్రామిక రంగం

'తెలుగుదేశం హయాంలో పరిశ్రమలకు అన్ని విధాల ప్రోత్సాహం అందించి రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది చేస్తే జగన్ రెడ్డి తన చర్యలతో పారిశ్రామిక రంగాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లారు అని అచ్చెన్నాయుడు విమర్శించారు. '2018 స్టార్టప్ ర్యాంకింగ్స్‌లో ఏపీ దేశంలోనే మొదటి స్ధానంలో నిలిస్తే 2020-21 లో స్టార్టప్ ర్యాంకింగ్స్‌లో చిట్టచివరన బీహార్ సరసన చేరింది. వైసీపీ క్యాలెండర్‌లో ఆగస్టులో ఎంఎస్ఈసీలకు పారిశ్రామిక రాయితీలిస్తామన్నారు.

కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 3 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి చేసిన తప్పులు, అప్పులతో పాటు నిరుద్యోగం కూడా పెరిగింది. జగన్ రెడ్డి 3 ఏళ్లలో రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా? జగన్ రెడ్డి ప్రతిపక్షాలను వేధించటంపై పెట్టిన శ్రద్దలో కనీసం 1 శాతం పారిశ్రామిక రంగంపై పెట్టినా రాష్ట్రంలో ఈ పరిస్ధితి ఉండేది కాదు. జగన్ రెడ్డి ఇకనైనా తన తీరు మార్చుకోవాలి' అని అచ్చెన్నాయుడు హితవు పలికారు.



Next Story

Most Viewed