వారికి కాసింత ప్రోత్సాహం, ఆర్థికపరమైన చేయూతనిస్తేవారు రాణిస్తారు: పవన్ కల్యాణ్

by Seetharam |
వారికి కాసింత ప్రోత్సాహం, ఆర్థికపరమైన చేయూతనిస్తేవారు రాణిస్తారు: పవన్ కల్యాణ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘దివ్యాంగుల శక్తిసామర్థ్యాలను, వారి ప్రతిభా పాటవాలను గుర్తించి ప్రోత్సహించగలిగితే చాలు... చక్కగా రాణిస్తారు’అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దివ్యాంగుల అభివృద్ధిని, వారి సంక్షేమాన్ని జనసేన పార్టీ ఎప్పటికీ విస్మరించదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విద్య, ఉపాధి కల్పనలో వారిని ఖచ్చితంగా ముందుకు తీసుకువెళతామని పవన్ కల్యాణ్ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘జనవాణి కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో నా ముందుకు ఎంతోమంది దివ్యాంగులు వచ్చారు. తమ సమస్యలను, ఆవేదనను వెలిబుచ్చారు. వారు కోరుకునేది కాసింత ప్రోత్సాహం, ఆర్థికపరమైన చేయూత. కానీ ఈ విషయాలను పాలకులు తమ ప్రాధాన్య అంశాలుగా తీసుకోవడంలేదు. దివ్యాంగుల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దివ్యాంగుల విషయంలో కూడా రాజకీయాలు చొప్పించి ఇబ్బందులు పెట్టిన దాఖలాలు నా దృష్టికి వచ్చాయి. తమ పక్షం కాని వారి పింఛన్ల మంజూరులోనూ ఇక్కట్ల పాల్జేస్తున్నారు. కచ్చితంగా రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో దివ్యాంగులు, అంధులు, విభిన్న ప్రతిభావంతులకు చేయూతను అందిస్తాం. వారికి ధృవపత్రాల జారీని సరళీకరించడంతో పాటు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూస్తాం’అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.



Next Story

Most Viewed