ముగ్గురి ప్రాణాలు కాపాడిన రైల్వే కీ మ్యాన్‌

by srinivas |
ముగ్గురి ప్రాణాలు కాపాడిన రైల్వే కీ మ్యాన్‌
X

దిశ‌, పిఠాపురం: పాపం వారికి ఏం క‌ష్టం వ‌చ్చిందో తెలీదు కానీ నిండు ప్రాణాలు తీసుకోవ‌డానికి సిద్ధపడ్డారు. లోకం తెలియ‌ని చిన్నారుల‌ను సైతం త‌న‌తో తీసుకుపోవ‌డానికి తల్లి నిర్ణయించుకుంది. అనుకున్నదే త‌డవుగా రైలు ట్రాక్‌పై ప‌రుగులుపెట్టింది. అదృష్టవశాత్తు ట్రాక్‌పై ఉన్న కీ మ్యాన్ వారిని చావు నుంచి త‌ప్పించాడు. ఈ సంఘ‌ట‌న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం దుర్గాడ రైల్వే గేటు వ‌ద్ద జ‌రిగింది.


కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండ‌లానికి చెందిన వివాహిత, త‌న భ‌ర్తతో ఉన్న విభేదాల‌తో కాపురానికి వెళ్లలేదు. ఇద్దరు మ‌న‌స్పర్థలతో వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో కొద్దికాలం క్రితం పెద్దలు ఇరువురికి స‌ర్థి చెప్పి అత్తింటికి పంపించారు. మళ్లీ ఏమైందో ఏమో గానీ ఆమె తిరిగి అమ్మగారింటికి పిల్లలతో బ‌య‌లుదేరింది. మార్గమ‌ధ్యలో దుర్గాడ రైల్వేగేటు వ‌ద్ద ఆటో దిగి ఇద్దరు ఆడ‌పిల్లలతో క‌లిసి ట్రాక్‌పైకి వ‌చ్చేసింది. అదే స‌మ‌యంలో వేగంగా రైలు విశాఖప‌ట్నం నుంచి పిఠాపురం వైపు వ‌స్తోంది. పిల్లలను చేత ప‌ట్టుకుని ట్రాక్‌పై ప‌రుగెడుతున్న త‌ల్లిని గ‌మ‌నించిన రైల్వే కీ మ్యాన్ పిడుము వెంక‌టేశ్వర్లు వారిని వెంబ‌డించాడు. అనుమానం వ‌చ్చి ఆరా తీయ‌గా చిన్నారులు జ‌రిగిన విష‌యాన్ని చెప్పడంతో షాక్ తిన్నాడు. వెంట‌నే ట్రాక్‌పై నుంచి పిల్లలను,త‌ల్లిని త‌ప్పించి 100కి ఫోన్ చేయ‌డంతో పోలీసులు వ‌చ్చారు. త‌ల్లిని ఓదార్చి కౌన్సిలింగ్ నిమిత్తం కాకినాడ దిశ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. పిల్లలతోపాటు, త‌ల్లి ప్రాణాలు కాపాడిన కీమ్యాన్ వెంక‌టేశ్వర్లును పిఠాపురం సిఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, స్థానికులు అభినందించారు. పిల్లలతో క‌లిసి తల్లి బ‌ల‌వ‌న్మరణానికి పాల్పటానికి గ‌ల కార‌ణాల‌ను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె కుటుంబ స‌భ్యులకు వివ‌రాలు తెలిపారు.

పిల్లల దీన చూపులు..100 కాల్‌కు స్పందించిన పోలీసులు

వాస్తవానికి కీ మ్యాన్ వెంక‌టేశ్వర్లు ట్రాక్‌పై ఆత్మహత్యకు సిద్ధపడిన త‌ల్లి, పిల్లలను కాపాడే ప్రయత్నంలో కాస్త కంగారు ప‌డ్డాడు. త‌మ బంధువులు వ‌స్తున్నార‌ని ఆమె చెప్పిన అబ‌ద్ధాన్ని న‌మ్మలేదు. ఇంత‌లో పిల్లల ధీన చూపు కీ మ్యాన్ అనుమానానికి మ‌రింత బ‌లం చేకూర్చింది. వెంట‌నే పిల్లలు తాము చ‌నిపోతున్నామ‌ని చెప్పిన మాట‌ల‌తో కీ మ్యాన్ వెంట‌కేశ్వర్లు సైతం ఆందోళ‌న‌కు గుర‌య్యాడు. వెంట‌నే 100కి ఫోన్ చేశాడు. నిమిషాల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేప‌టికే పిఠాపురం సిఐ వైఆర్‌కే శ్రీనివాస్ సంఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని వారిని ఓదార్చారు. ధైర్యం చెప్పి ఆయ‌న వాహ‌నంలో కాకినాడ దిశ పోలీస్‌స్టేష‌న్‌కు పంపించారు. ఈ ఘ‌ట‌న‌లో 100 కాల్‌కు స్పందించిన పోలీసులు తీరును అక్కడి గ్రామ‌స్తులు కొనియాడారు.



Next Story

Most Viewed