YCP Sarpanch: రెండేళ్ల పాటు న‌ర‌కం చూపించారు..!

by srinivas |   ( Updated:2023-04-09 14:48:56.0  )
YCP Sarpanch: రెండేళ్ల పాటు న‌ర‌కం చూపించారు..!
X

దిశ‌, పిఠాపురం: స‌ర్పంచిగా ఎన్నికైన నాటి నుండి రెండేళ్లుగా న‌ర‌కం చూపించారు. వైసీపీ అంటే అభిమానం, అధికార పార్టీ అండ‌గా ఉంటే గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చన్న ఒక కార‌ణంతో అన్ని భ‌రించాము ఇక ఇక్కడ అవ‌మానాల్ని త‌ట్టుకునే ఓపిక లేదంటూ పిఠాపురం మండ‌లం న‌వ‌ఖండ్రవాడ స‌ర్పంచి ర‌జినీ వాణి తీవ్ర ఆవేద‌న వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామ పెద్దల‌తో స‌మావేశ‌మైన ఆమె త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని వివ‌రించారు. గ్రామంలో గ‌డ‌ప‌..గ‌డ‌ప‌కు జ‌రిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దొర‌బాబు, ఎంపీపీ క‌న్నా బ‌త్తుల కామేశ్వర‌రావు ప్రొద్భలంతో త‌నను తీవ్రంగా అవ‌మానించార‌న్నారు. గ్రామాభివృద్ధిపై ప్రశ్నిస్తే తనను నెట్టివేశార‌ని, వైసీపీ హ‌యాంలో గ్రామంలో ఇసుమంతైనా అభివృద్ధ జ‌ర‌గ‌లేద‌ని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రథ‌మ పౌరురాలైన‌ప్పటికీ క‌నీసం ఎటువంటి స‌మాచారం ఇవ్వక‌పోగా, బ్లీచింగ్ చ‌ల్లించ‌డానికి కూడా అవ‌కాశం లేకుండా నియంత పాల‌న చేస్తున్నార‌ని మండిపడ్డారు. పంచాయ‌తీ కార్యాల‌యానికి కూడా తాళం వేస్తున్నారని ఆరోపించారు. వైసీపీలో ఉండి ఇక సాధించేది ఏమీ లేక టీడీపీలోకి చేరుతున్నట్లు తెలిపారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయపై గ్రామ‌స్తులంతా త‌న‌కు తోడురావాల‌ని స‌ర్పంచి ర‌జ‌నీ వాణి కోరారు.

టిడిపిలో చేరిక‌..

వైసీపీ స‌ర్పంచిగా ఉన్న ర‌జినీ వాణి టీడీపీలో చేరారు. వైసీపీలో ఉండి ఉప‌యోగం లేద‌ని, గ్రామ‌పెద్దలు, త‌మ అనుచ‌రుల నిర్ణయం మేర‌కు పార్టీ మారుతున్నట్లు ఆమె ప్రక‌టించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన స‌మావేశానికి మాజీ ఎమ్మెల్యే వ‌ర్మను ఆహ్వానించి, ఆయ‌న స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సంద‌ర్బంగా వ‌ర్మ మాట్లాడుతూ వైసీపీలో కుల వివ‌క్ష బాగా ఉంద‌న్నారు. దొర‌బాబు ద‌ళితుల‌కు తీర‌ని అన్యాయం చేస్తున్నార‌ని మండిపడ్డారు. టీడీపీ అధికారం చేప‌ట్టిన వెంట‌నే గ్రామాభివృద్ధికి ఇదే స‌ర్పంచి ర‌జ‌నీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామ‌ని మాట ఇస్తున్నామ‌న్నారు. క‌నీసం ప్రజ‌ల అవ‌స‌రాలు తీర్చలేని ఎమ్మెల్యే మ‌రోసారి త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపించాల‌ని కోరడం చూస్తుంటే హాస్యాస్పందంగా ఉంద‌న్నారు. నువ్వే మా న‌మ్మకం జ‌గ‌న్ అంటుంటే న‌వ్వొస్తుంద‌ని, ముందు జ‌గ‌న్ కుటుంబ స‌భ్యులే జ‌గ‌న్‌ను న‌మ్మితే అప్పుడు చూద్దామని వ‌ర్మ ఎద్దేవా చేశారు.



Next Story