మిస్టరీగా మారిన బీఫార్మసీ విద్యార్థిని మృతి.. అలా చంపినట్టుగా తండ్రి అనుమానం..

by Disha Web |
మిస్టరీగా మారిన బీఫార్మసీ విద్యార్థిని మృతి.. అలా చంపినట్టుగా   తండ్రి అనుమానం..
X

దిశ, వెబ్‌డెస్క్: రోజు రోజుకు సమాజంలో ప్రేమ హత్యలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఏదో ఒక చోటు ప్రేమ పేరుతో దాడులు జరుగుతూనే ఉన్నాయి. నమ్మించి మోసం చెయ్యడం, ప్రేమను తిరస్కరించారని యాసిడ్ పోసి చంపడం ఇదే జరుగుతుంది ప్రస్తుత సమాజంలో. అలాంటి ఓ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల పట్టణానికి చెందిన గోపి, నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె తేజశ్విని తిరుపతిలో కృష్ణతేజ ఫార్మసి కళాశాలో బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతూ అక్కడే హస్టల్లో ఉంటుంది. తేజశ్విని హాస్టల్ నుండి తన ఇంటికి వెళ్లిన సమయంలో సాధిక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. తరచూ వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు.

అయితే తిరుపతి కాలేజీ హాస్టల్లో ఉంటున్న ఆమె సడన్‌గా మల్లాపల్లిలోని ప్రియుడు నివాసం ఉంటున్న షెడ్డులో శవమై కనిపించింది. దీంతో తేజశ్విని హత్యపై మరిన్ని అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తేజశ్విని బ్యాగ్, ఫోన్ స్వాధినం చేసుకున్నారు. పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

ఈ ఘటనపై మృతురాలి తండ్రి గోపి మాట్లాడుతూ.. నా కుమార్తె తేజస్వినికి మాయమాటలు చెప్పి తిరుపతి నుంచి తీసుకొచ్చి గ్యాంగ్ రేప్ చేసి చంపారని, మేము రాకముందే పోస్టుమార్టం నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకు రీపోస్టుమార్టం చెయ్యనున్నారు. కాగా నిందితుడు సాదిక్ పరారీలో ఉండగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ ఘటనలో అత్యాచారం జరగలేదని, యువతి మృతిపై మాత్రం అనేక అనుమానాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. రాత్రి 10గంటల వరకు ఇద్దరు రూమ్‌లో ఉన్నారని.. ఆ తర్వాత భోజనం తెచ్చేందుకు సాధిక్ బయటకు వెళ్లి వచ్చే సరికి తేజశ్విని మృతి చెంది ఉన్నట్లు వారు చెబుతున్నారు. కానీ పరారీలో ఉన్న సాదిక్‌ను అదుపులోకి తీసుకున్నాకే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed