వైసీపీకి మరో బిగ్ షాక్.. ఓటమి ఎఫెక్ట్‌తో పార్టీకి కీలక నేత రాజీనామా

by Satheesh |
వైసీపీకి మరో బిగ్ షాక్.. ఓటమి ఎఫెక్ట్‌తో పార్టీకి కీలక నేత రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారాన్ని కోల్పోయిన వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల ఫలితాలు వెలువడి సరిగ్గా వారం రోజులు గడవకుండానే ఆ పార్టీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఎన్నికల్లో ఘోర ఓటమి ఎఫెక్ట్‌తో ఇప్పటికే పలువురు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా మరో సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేశారు. గుంటూరుకు చెందిన సీనియర్ నేత చందు సాంబశివరావు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రిజైన్ లెటర్‌ను పార్టీ అధినేత జగన్‌కు పంపించారు. కాగా, చందు సాంబశివరావు ఎన్నికలకు ముందు బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

బీజేపీ నుండి గుంటూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించగా అధిష్టానం ఆయనకు ఇవ్వలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన సాంబశివరావు కాషాయ పార్టీ గుడ్ బై చెప్పి అప్పటి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో తిరిగి ఆ పార్టీకి రాజీనామా చేసిన సాంబశివరావు తిరిగి మళ్లీ సొంతగూటికి (బీజేపీ) చేరనున్నట్లు వెల్లడించారు. కాగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed