తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు సందేశం ఇదే..!

by srinivas |
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు సందేశం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. డిసెంబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే బుధవారం ఉదయం నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. 67 సీట్లలో కాంగ్రెస్, 38 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దీంతో దాదాపు కాంగ్రెస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. తెలంగాణ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు తమ సందేశాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

‘తెలంగాణ ఎన్నికల ఫలితం ఏదైనా అది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల నిర్ణయం. దానిని అన్ని పార్టీల వలే మనం కూడా శిరోధార్యంగా భావించాలి. ఫలితాలను చూసి మీమీ వ్యక్తిగత అభిప్రాయాల మేరకు గెలిచిన వ్యక్తులకు లేదా పార్టీలకు హుందాగా అభినందనలు తెలియజేయండి కానీ ఓడిపోయిన వ్యక్తులను, పార్టీలను పలుచన చేసే విధంగా వ్యాఖ్యలు చేయవద్దు. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేవి సహజం. 40 సంవత్సరాలకు పైగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పాల్గొని అధికార పక్షం పాత్ర అయినా, ప్రతిపక్షం పాత్ర అయినా పార్టీ పరంగా కానీ, నాయకులు, కార్యకర్తల పరంగా కానీ మనం మన పాత్రను ఎంతో హుందాగా నిర్వహించాం. తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిద్దాం. ఏపీలో మనం ఎదుర్కోబోయే ఎన్నికలపై దృష్టి పెడదాం.’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed