అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

by Disha Web Desk 22 |
అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ఐదురోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మెుత్తం ఐదురోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మెుత్తం 26గంటల 44 నిమిషాల పాటు సభ జరిగింది. ఐదు రోజులలో 21 కీలకమైన బిల్లులను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను శాసన సభ ఆమోదించింది. అలాగే పోలవరం, నాడు-నేడు, మూడు రాజధానుల అంశం వంటి నాలుగు కీలకమైన అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది.

అయితే చివరి రోజు డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును డా.వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మార్చుతూ కీలక బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టగా శాసన సభ ఆమోదించింది. అయితే ఎన్టీఆర్ పేరు మార్పును నిరసిస్తూ టీడీపీ సభ్యులు అసెంబ్లీలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్పీకర్‌పై బిల్లు ప్రతులను చించి వేశారు. దీంతో స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు శాసన మండలి సైతం నిరవధిక వాయిదాపడింది.

టీడీపీ సభ్యుల తీరు దురదృష్టకరం: స్పీకర్ తమ్మినేని

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగకుండా టీడీపీ సభ్యులు అడ్డుపడుతూనే ఉన్నారని స్పీకర్ అన్నారు. పోడియంపైకి వచ్చి విపక్ష ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. అలాంటి సభ్యులు సభకు రావడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అరాచకం సృష్టించేవాళ్లను చూస్తే బాధగా ఉందని.. ఇలాంటి ఆగడాలకు ఎక్కడోకచోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

టీడీపీ సభ్యుల తీరుపై చర్యలకు ప్రివిలేజ్‌ కమిటీకి సిఫారసు చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పేపర్లు చించి స్పీకర్‌పైకి విసిరి కొట్టిన అనుచితంగా ప్రవర్తించడంతోపాటు స్పీకర్ చైర్ వద్దకు వచ్చి దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు.


Next Story

Most Viewed